ప్రజల ఇబ్బంది: ఏటీఎంలపై మోడీ ప్రభుత్వం పావులు!
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్లాక్ మనీ ఉన్నవాళ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద నోట్ల రద్దును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే, ఇది సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తోంది.
ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్ద వరుస కడుతున్నారు. గంటల తరబడి నిలబడినా చాలామందికి డబ్బులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారికి పరిష్కారం చూపే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా కేంద్రం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఛైర్మన్గా టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల ద్వారా తక్కువ సమయంలో రూ.2వేల నోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇది కృషి చేయనుంది.
ప్రస్తుతం ఏటీఎంల ద్వారా వేగంగా రూ.2వేల నోట్లను ఖాతాదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, రూ.2వేల నోట్లను డ్రా చేసుకునేందుకు అనువుగా వీలైనన్ని ఏటీఎంలలో మార్పులు చేపట్టాల్సిన అవసరముందని, ఇందుకోసం ముంద్రా ఛైర్మన్గా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు.
ఈ బృందం బ్యాంకులతో పాటు వివిధ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ ఏటీఎంలలోని హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను రూ.2వేల నోట్లు జారీకి అనుగుణంగా త్వరితగతిన మార్చేందుకు కృషి చేయనుంది. దీనిపై చర్చించేందుకు సోమవారం లేదా, మంగళవారం టాస్క్ఫోర్స్ అత్యున్నత భేటీ జరగనుంది.
ఆర్థిక, హోం మంత్రిత్వశాఖలతో పాటు బ్యాంకులకు చెందిన ఎనిమిది మంది సభ్యులు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరితోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్బీఐ సభ్యులు ఇందులో భాగస్వాములు కానున్నారు.