హైపవర్ కమిటీ రిపోర్టులు రెడీ.. మధ్యాహ్నాం కేసీఆర్ చెంతకు
హైదరాబాద్ : కొత్త జిల్లాల సంఖ్య 27 నుంచి 31 పెరిగిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు జిల్లాలకు సంబంధించి ఈ కమిటీ నివేదికలు సమర్పించనుంది. ఏయే మండలాలను, రెవెన్యూ డివిజన్లను ఏయే జిల్లాల పరిధిలోకి తీసుకురావాలనే విషయమై ఈ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కాగా, ఇప్పటికే నివేదికలు సిద్దం చేసిన హైపవర్ కమిటీ.. మరికాసేపట్లో ఆ నివేదికలను సీఎం కేసీఆర్ కు అందించనుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం 27 జిల్లాలతో ప్రకటన విడుదల చేశాక కొత్తగా గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లా కేంద్రాల ఏర్పాటు తెరపైకి రావడం.. ఆ తర్వాత ఆసిఫాబాద్ ను కూడా జిల్లా కేంద్రం చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం రావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా ఈ నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై కసరత్తులు చేసింది హైపవర్ కమిటీ. ఇందుకోసం ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ సేకరించింది. చివరగా పూర్తి వివరాలతో నివేదికలను సిద్దం చేసిన కమిటీ తుది రిపోర్టును ఈరోజు మధ్యాహ్నాం సీఎం కేసీఆర్ కు అందజేయనుంది.