కెసిఆర్ భారీ ప్లాన్: ఉప్పల్ నుంచి యాదాద్రికి హైస్పీడ్ మెట్రో రైలు
హైదరాబాద్: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిని (యాదగిరి గుట్ట)ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా వంద కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం.. అక్కడికి రవాణా మార్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు హైస్పీడ్ మెట్రో రైలు మార్గం వేయాలని సీఎం కెసిఆర్ యోచిస్తున్నారు.
నగరం నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో యాదగిరి గుట్ట ఉంది. భవిష్యత్తులో యాదాద్రికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు హైస్పీడ్ మెట్రో మార్గం నిర్మాణం ప్రణాళిక తయారు చేయాలని కెసిఆర్ సూచించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ మార్గం పైన ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని, ఇందుకోసం ఎకరా స్థలం కూడా తీసుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మెట్రో రైలును యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం పొడిగించాలన్న ఆలోచన మంచిదే అన్నారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీ, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ రెండు మార్గాల్లో అన్ని రకాల ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని చెప్పారు.