కొడంగల్ లో అర్ధరాత్రి హై టెన్షన్.. రోడ్డుపై బైఠాయించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కొడంగల్ లో శనివారం అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆయన అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేయడం వారి ఆగ్రహానికి కారణమైంది. రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు పోలీసులు దాడిచేయడం దారుణమంటూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న రేవంత్ రెడ్డి వారితో పాటే రోడ్డుపై బైఠాయించారు.
కొడంగల్ లో ఇద్దరు, బొంరాస్ పేట మండలంలోని మరో ఇద్దరి ఇళ్లల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కక్షసాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో దాడులు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. అటు సోదాలు జరుగుతుండగానే ఇటు నిరసనకు దిగారు. పోలీసుల వైఖరిపై మండిపడుతూ సోదాల్లో ఏం దొరికాయో చెప్పాలంటూ నిలదీశారు.
అర్ధరాత్రి టెన్షన్ టెన్షన్
కొడంగల్ లో అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో పోలీసులు దాడి చేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైరయ్యారు. అనుమతులు లేకుండా తనిఖీలు చేస్తారా అంటూ ఎదురుతిరిగారు. కక్షసాధింపులో భాగంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. పోలీసాధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకండా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ నర్సింలు తో పాటు డీఎస్పీ రవీంద్రరెడ్డి ఆందోళన విరమించాలని కోరినా ఫలితం దక్కలేదు. పోలీసాధికారుల విజ్ఞప్తికి రేవంత్ అనుచరులు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి దాటిన కూడా ధర్నా కొనసాగినట్లు సమాచారం. కాంగ్రెస్ శ్రేణుల ధర్నాతో అక్కడి పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అందుకేనా రేవంత్ టార్గెట్?
ఎన్నికల ప్రచార పర్వంలో టీఆర్ఎస్ నేతలపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా తనకు ప్రాణభయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎప్పుడు ఏంజరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కక్ష సాధించేందుకే పోలీసులను ఉసిగొల్పుతున్నరనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కొడంగల్ లోనూ రేవంత్ రెడ్డిపై పట్నం సోదరుడిని పోటీగా నిలబెట్టి కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఆటంకాలు కలిగించేలా పోలీసులను పంపుతూ ఇలా దాడులకు పాల్పడటం సరికాదని మండిపడుతున్నారు.
భయపెట్టేందుకేనా ఈ దాడులు?
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ పాలన అంటూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఇదంతా టీఆర్ఎస్ నేతలకు మింగుడుపడకనే రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలని ప్లాన్ చేశారంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. టీఆర్ఎస్ నేతలు కోట్లు ఖర్చుపెడుతున్నా పట్టించుకోని పోలీసులు.. చీటికిమాటికి కాంగ్రెస్ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతల తప్పుడు ఫిర్యాదులతో సోదాల పేరిట తమను భయభ్రాంతులకు గురిచేసేలా ఇబ్బందులు పెడుతున్నారని ఫైరవుతున్నారు. ఏవరూ ఏమి చేసినా తాము భయపడబోమని రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని చెబుతున్నారు. మొత్తానికి కొడంగల్ తాజా ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.