శభాష్ జర్నలిస్ట్స్: కరోనా గురించి అవగాహన కల్పించడంలో భేష్, హైకోర్టు ప్రశంసలు..
కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు ముందున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాణాలకు తెగించి న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ఆర్థికసాయం చేయాలని రాపోల్ భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. అతని తరఫున కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. జర్నలిస్టుల సమస్యలపై రెండువారాల్లో ప్రభుత్వానికి రిప్రజంటేషన్ సమర్పించాలని కోరింది. జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
జర్నలిస్టుల పిటిషన్ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కౌన్సిల్ రంగయ్య కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ జర్నలిస్టుకు 25 వేల ఇవ్వాలని కోర్టును కోరారు. వార్తల సేకరణలో భాగంగా జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు ఉచితంగా అందజేయాలని కోరారు. లేదంటే వారి ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నారు.
న్యాయవాదులకు రూ.25 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అదేవిధంగా మీడియా ప్రతినిధులను కూడా ఆదుకోవాలని రంగయ్య ధర్మాసనాన్ని కోరారు. మధ్యలో కల్పించుకున్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని కోర్టుకు వివరించారు. తర్వాత ధర్మాసనం స్పందిస్తూ.. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వానికి రిప్రజంటేషన్ ఇవ్వాలని.. వారి సమస్యలను రెండు వారాల్లో పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని హైకోర్టు సూచించింది.