ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయమేంటో తెలుసా?
హైదరాబాద్ : సినీ నటుడు ప్రభాస్ హైకోర్టు మెట్లెక్కారు. తనకు సంబంధించిన గెస్ట్హౌజ్ సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బుధవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేసింది.
హైదరాబాద్ శివారు, గోల్కోండ ప్రాంతంలోని రాయదుర్గంలో పైగా భూములకు సంబంధించి కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయితే అవి ప్రభుత్వ భూములని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో ఆ భూముల్లో ఉన్న కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కొంతమేర కూల్చివేశారు. అక్కడే ప్రభాస్ కు చెందిన గెస్ట్హౌజ్ ఉంది. ఆ సమయంలో ప్రభాస్ మనుషులు ఎవరూ లేకపోవడంతో సీజ్ చేశారు అధికారులు.
రెవెన్యూ అధికారుల చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ప్రభాస్. గెస్ట్హౌజ్ సీజ్ చేసే విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని.. నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం సరికాదని ఆయన తరపు లాయర్ వాదించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ వివాదం చాలామందికి చెందిన అంశంగా భావించి ప్రభాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో గురువారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశముంది.