ఎందుకంత ప్రత్యేకత: ఇదీ బాలాపూర్ గణేష్ లడ్డూ చరిత్ర, నిధులు ఏం చేస్తారు?
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ ప్రతి ఏటా రికార్డ్ ధర పలుకుతోంది. ఈ సంవత్సరం కూడా 2017 కంటే లక్ష రూపాయలు ఎక్కువగా పలికింది. ఈసారి దీనిని బాలాపూర్కు చెందిన ఆర్యవైశ్య సంఘం దక్కించుకుంది. ఆర్యవైశ్య సంఘం తరఫున తేనేటిపల్లి శ్రీనివాస్ గుప్తా దీనిని దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకున్న వెంటనే అతను రూ.16.60 లక్షలను విగ్రహ కమిటీకి ఇచ్చారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ ఈసారి ఎంత ధర పలికిందంటే?
1980లో ప్రారంభమైన బాలాపూర్ గణేష్ యూత్ అసోసియేషన్
బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డూ వేలం పాట మాత్రం 1994లో రూ.450తో ప్రారంభమైంది. ఈ లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం. నమ్మకమే కాదు.. దీనిని వేళంలో దక్కించుకున్న వారు అనుభవపూర్వకంగా చెప్పినమాటలు. లడ్డూ వేలంపాట మొదలైన 17 సంవత్సరాలు స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు అవకాశమిస్తున్నారు.
వేళంలో బాలాపూర్ లడ్డూ ఇలా
1994లో బాలాపూర్ గణేషుడి లడ్డూను కొలను మోహన్ రెడ్డి రూ.450కి కొనుగోలు చేశారు. 1994 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎంతకు కొనుగోలు చేశారంటే...
- 1994 కొలను మోహన్ రెడ్డి రూ.450
- 1995 " " రూ.4500
- 1996 కొలను కృష్ణా రెడ్డి రూ.18,000
- 1997 కొలను కృష్ణారెడ్డి రూ.28,000
- 1998 కొలను మోహన్ రెడ్డి రూ.51,000
- 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65,000
- 2000 కళ్లెం అంజిరెడ్డి రూ.66,000
- 2001 జి రఘునందన్ రెడ్డి రూ.85,000
- 2002 కందాడ మాధవ రెడ్డి రూ.1.05 లక్షలు
- 2003 చిగురింత బాల్రెడ్డి రూ.1.55 లక్షలు
- 2004 కొలను మోహన్ రెడ్డి రూ.2.01 లక్షలు
- 2005 ఇబ్రామ్ శేఖర్ రూ.2.08 లక్షలు
- 2006 చిగురింత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలు
- 2007 జి రఘునందాచారి రూ.4.15 లక్షలు
- 2008 కొలను మోహన్ రెడ్డి రూ.5.07 లక్షలు
- 2009 సరిత రూ.5.10 లక్షలు
- 2010 శ్రీధర్ బాబు రూ.5.30 లక్షలు
- 2011 కొలను కుటుంబం రూ.5.45 లక్షలు
- 2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7.50 లక్షలు
- 2013 తీగల కృష్ణా రెడ్డి రూ.7.26 లక్షలు
- 2014 జైహింద్ రెడ్డి రూ.10 లక్షలు
- 2015 కళ్లెం మదన్మోహన్రెడ్డి రూ.10.32 లక్షలు
- 2016 కందాడి స్కైలాబ్ రెడ్డి రూ.14.65 లక్షలు
- 2017 నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలు
లడ్డూను దక్కించుకున్న వారు ఇలా
లడ్డూను దక్కించుకున్న తర్వాత 1994 నుంచి కొలను కుటుంబం బాగా సంపాదించింది. ఆ తర్వాత 1999లో దక్కించుకున్న ప్రతాప్ రెడ్డికి కూడా మంచి జరిగింది. ప్రతి ఏటా లడ్డూను దక్కించుకుంటున్న వారు మంచి జరుగుతోందని చెబుతున్నారు. గత పద్దెనిమిదేళ్లుగా లడ్డూ ఖ్యాతి మరింత వ్యాపించింది. అప్పటి నుంచి లడ్డూ ధర లక్షల్లో పలుకుతోంది.
పాతికేళ్ల ప్రస్థానంలో రికార్డ్
వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు, బాలాపూర్ లడ్డూ ధరపై చర్చించుకుంటారు. వేలం రోజు వేకువజాము నుంచే కోలాహలం నెలకొంటుంది. వినాయక చవితి మొదటి రోజు నుంచే పోటీ పడుతున్న వారి దరఖాస్తులు తీసుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటలకు దరఖాస్తులను ముగిస్తారు. వేలం పాట రూ.1116తో ప్రారంభమవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పైన సంతకం చేయాలి.
మంచి పనికి బాలాపూర్ లడ్డూ నిధులు
ఇక్కడ మరో విషయం ఏమంటే బాలాపూర్ లడ్డూ ద్వారా వచ్చిన డబ్బును మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి మరింత ఖర్చు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.