ఆర్టీసీ నెంబర్ ప్లేట్పై 'జడ్' అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?
అమరావతి: వాహనాల నెంబర్ ప్లేట్లపై రకరకాల అక్షరాల ఉంటాయి. సిరిస్ ప్రకారం రాష్ట్రాలకు సంబంధించిన రవాణాశాఖ ప్రతి వాహనానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ను కేటాయిస్తుంది. అయితే ఏపీ, తెలంగాణలోని బస్సుల నెంబర్ ప్లేట్లపై 'జడ్' అనే అక్షరం ఉంటుంది. ఇలా 'జడ్' అనే అక్షరం ఒక్క బస్సులపైనే ఎందుకు ఉంటుందో తెలుసా?
హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పరిపాలించినప్పుడు అప్పటి నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్టు' సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ 1932 జూన్లో తొలిసారిగా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి జహ్రాబేగం పేరిట నమోదు చేయించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీకి చెందిన ప్రతి బస్సు నెంబర్లో ఆమె పేరులోని మొదటి అక్షరమైన ‘జడ్'తో ప్రారంభమవుతుంది. అంతేకాదు నిజాం తన సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే, ఆ తర్వాత ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇంకో విషయం ఏమిటంటే నిజాం కాలంలో సిటీ బస్సులు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచేవి. ప్రస్తుతం ఉన్న ట్యాంక్ బండ్ అప్పుడు రెండు నగరాల మధ్య ప్రధాన రహదారిగా ఉండేది. అప్పటి నవాబ్ నివాసం కింగ్ కోఠి నుంచి సికింద్రాబాద్కు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన బస్సు నెంబర్ ఒకటి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూట్లో నెంబర్ వన్ పేరిట బస్సు నడుస్తూనే ఉంది. కింగ్కోఠితో పాటు ఉద్యోగులు, అధికారుల నివాస ప్రాంతాలకు బస్సులను నడిపేవారు.