నాందేడ్ సాధువుల హత్య: నిందితుడ్ని పట్టుకున్న తెలంగాణ పోలీసులు
ముంబై: మహారాష్ట్ర నాందేడ్ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతోపాటు అతని శిశ్యుడు భగవాన్ షిండే అనే మరో వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరులో హంతకుడు సాయినాథ్ శింఘడేను పట్టుకుని విచారణ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.
డబ్బు బంగారం కోసం హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో హంతకుడు అంగీకరించాడని సమాచారం. కాగా, ఆశ్రమం నుంచి రూ. 70వేల నగదు, ఓ ల్యాప్టాప్ ను నిందితుడు దొంగిలించినట్లు తెలిసింది.
శనివారం అర్ధరాత్రి హత్యలు జరగగా.. ఆదివారం తెల్లవారుజామున సాధు శివాచార్య మృతదేహం ఆశ్రమంలోనే లభించింది. ఆయన శిష్యుడి మృతదేహం ఆశ్రమానికి కొద్దిదూరంలో కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.
సాధువు, ఆయన శిష్యుడిని కొట్టి చంపిన దుండగులు: రెండు నెలల్లో రెండోసారి: రక్తపు మడుగులో
కాగా, శివాచార్య చాలాకాలం కిందటే నాందెడ్ జిల్లాలోని ఉమ్రి తాలూకాలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. తరచూ ఆధ్యాత్మక ప్రసంగాలను ఆయన ఇస్తుంటారు. ఆశ్రమం పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో ఆయనకు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. శివరాత్రి వంటి పండుగల సమయంలో శివాచార్య ఆశ్రమం వందలాదిమంది భక్తులతో సందడిగా మారుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆశ్రమానికి వస్తుంటారు.