దేవరకొండ బంద్: 'యాలాల ఎస్ఐ మృతి వెనుక మంత్రులున్నారనే వార్తలు'
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేశ్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తూ గిరిజిన సంఘాలు శుక్రవారం దేవరకొండ నియోజకవర్గంలో బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో దేవరకొండ నియోజక వర్గంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు, పాఠశాలలను స్వచ్ఛందగా మూసివేశారు.
మరోవైపు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ యాలాల ఎస్సై రమేష్ హత్య వెనుక తెలంగాణ మంత్రులున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయన్నారు. ఎస్సై హత్య వెనుక ఇసుక మాఫియా ఉందని అంటున్నారని, ఇసుక మాఫియా అంటే ఎవరు? అన్నది నిగ్గుతేల్చాలన్నారు.
ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని ఆయన ఆరోపించారు. సిట్టింగ్ జడ్జ్తో ఈ కేసు విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. ఈ కేసును సీఐడీకి కాకుండా సీబీఐకి అప్పగించాలని సూచించారు. ఎస్సై మృతిపై సీఐడీ విచారణ కాకుండా, సీబీఐ విచారణ జరిపించాలని ఆదేశించని పక్షంలో మృతదేహాన్ని తెలంగాణ హోంమంత్రి నివాసానికి తీసుకెళ్లి అక్కడ ధర్నా చేస్తామని చెప్పారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఈ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎస్ఐ రమేష్ మృతిపై సిబి సిఐడి విచారణకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఆదేశించింది. రమేష్ కుటుంబ పరిస్థితిని చూస్తే జాలేసిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
డిపార్ట్మెంట్ మంచి ఎస్ఐని కోల్పోయిందని అన్నారు. ఇసుక మాఫియాపై అనుమానం ఉండటంతోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వాస్తవాలను బయటికి తీస్తామని వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ ఘటన దురదృష్టకరమని ఆయన తెలిపారు.
ఎస్సై రమేశ్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి: ఎర్రబెల్లి
రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేశ్ మృతిపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఎస్సై మృతి వెనుక పెద్దల హస్తముందని ఆయన ఆరోపించారు.
సీఐడీ విచారణతో ఫలితముండదని సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించకపోతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామన్నారు.