నాడు కేసీఆర్ను తిట్టిన ముం..కొడుకులే : హోంమంత్రి నాయిని సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: 'నాడు సీఎం కేసీఆర్ను బండబూతులు తిట్టిన ముం.. కొడుకులే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా.. రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముద్రించిన 2018 ఏడాది క్యాలెండర్ను నాయిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
తిట్టినోళ్లు, తిట్టనోళ్లు ప్రస్తుతం ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీని నామరూపాల్లేకుండా చేయడానికే ఆ పార్టీకి చెందిన వారిని టీఆర్ఎస్లో చేర్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
మగాడు అంటే మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డేనని. నాడు చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చలేదని నాయిని పేర్కొన్నారు. 1969 ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని, ఎన్నో శక్తులు అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించి చూపించామని నాయిని అన్నారు. ఇక, రైతులకు 24 గంటల కరెంటు అందజేస్తూ సీఎం కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు.
1969 తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. 1969తో పాటు మలిదశ ఉద్యమంలో ఎంతో మంది పాల్గొన్నారని, వారందరికీ పింఛన్లు, గుర్తింపు కార్డులు, బస్ పాస్లు ఇవ్వడం సాధ్యంకాదని హోంమంత్రి స్పష్టం చేశారు.
అయితే, ఉద్యమంలో అమరులైన కుటుంబాలను మాత్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం, ఇంటిలో ఒకరికి ఉద్యోగం ప్రభుత్వం కల్పిస్తుందని నాయిని చెప్పారు. కార్యక్రమంలో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ప్రధాన కార్యదర్శి సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.