లాక్డౌన్ నిబంధనలకు లోబడే రంజాన్ ప్రార్థనలు.!మార్గదర్శకాలను పాటించాలన్నహోంమంత్రి.!
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పవిత్ర రంజాన్ ప్రార్థనలు చేయాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భగా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో నలుగురు మాత్రమే ప్రార్థనలు చేయాలని హోం మంత్రి తెలిపారు.
ఈద్-ఉల్-ఫితర్ నమాజ్, జుమ్మా నమాజ్ లలో నలుగురు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు చేయాలని పేర్కొన్నారు. మసీదు చిన్నదైనా, పెద్దదైనా నలుగురి కన్నా ఎక్కువ మంది ఉండరాదని స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులను , లాక్డౌన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులు ప్రభుత్వ సూచనలను విధిగా పాటించాలన్నారు హోంమంత్రి.
సకాలంలో మసీదులు అందుబాటులో లేనప్పుడు సొంత ఇళ్లలో ప్రార్థనలను చేసుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రెండవ దశ చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీనివల్ల అజాగ్రత్త వహిస్తే ఇబ్బందులపాలవుతారని, దీనిని నివారించడానికి సామాజిక దూరం మరియు శానిటైజర్ లేదా సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో మసీదులలో గుమిగూడడం మానుకోవాలని, ఇళ్లలో ప్రార్థనలకు ప్రాముఖ్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేసారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని మసీదులలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదుల వెలుపల ప్రార్థనలు చేయడానికి అనుమతి లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిర్వహించరాదన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి, నియమాలను ఖచ్చితంగా పాటించడానికి ముస్లిం సోదరులందరూ కలిసి పనిచేయాలని మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.