ఏపీ, టీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం కసరత్తు: అనుకున్నట్లు జరిగితే ఈ ఎన్నికల్లోనే!
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పెంపు విషయమై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి అనేకమార్లు విన్నవించుకున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రస్తుతం ఆ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ విషయంపై కసరత్తులను ముమ్మరం చేసినట్లు సమాచారం. గత మూడు నెలలుగా నియోజకవర్గాల పెంపుపై స్పష్టత తీసుకొచ్చేందుకు కేంద్రం ఆ దిశగా ముందుకు సాగుతోంది.
5జీ టెక్నాలజీ, 40లక్షల ఉద్యోగాలు: కేంద్రమంత్రివర్గ కీలక నిర్ణయాలివే
సీట్ల పెంపుపై ప్రారంభమైన కసరత్తు
ప్రస్తుత రిజర్వేషన్ల వివరాలు తెలపాలని, ఎన్ని నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ జనరల్ కేటగిరీల్లో ఉన్నాయో చెప్పాలని, ఏ కేటగిరికీ ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది. కాగా, కేంద్రహోంశాఖ అడిగిన అంశాలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందో చెప్పాలని కోరింది. దీంతో రిజిస్ట్రార్ జనరల్ నుంచి హోంమంత్రిత్వ శాఖ అభిప్రాయం తీసుకుంది.
పునర్విభజన చేపట్టవచ్చు
2011 జనభా లెక్కల పూర్తి నివేదిక తయారు కాలేదని, 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చని రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదికను కేంద్రహోంశాఖ ఎన్నికల సంఘానికి పంపింది. కాగా, ఇటీవల అధికారులతో ఈ అంశంపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గబా సమీక్ష నిర్వహించారు.
పెంచిన నియోజకవర్గాతోనే..
తెలంగాణ ముందస్తు ఎన్నికల దృష్ట్యా పోలవరం ముంపు మండలాలపై కూడా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. కాగా, పెంచిన నియోజకవర్గాలకు అనుగుణంగానే ఎన్నికలకు వెళ్లాలని హోంశాఖ భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపుపై హోంశాఖలో అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసుకుని, ఎన్నికల సంఘం ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల సంఘం ఈ వారంలో కానీ, వచ్చే వారంలో కానీ నివేదిక ఇస్తుందనే అభిప్రాయాన్ని హోంశాఖ వర్గాలు వెల్లడిస్తుండటం గమనార్హం.
ఈ ఎన్నికలు సీట్ల పెంపుతోనే..?
అక్టోబరు 15-20తేదీలోగా ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తుందనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తే వెనువెంటనే ఈ నిర్ణయాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళ్లి రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన పక్రియను పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది. ఒక వేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది.