హోంగార్డుల కళ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం..! 1న కానిస్టేబుళ్లతో పాటే జీతాలు..!!
హైదరాబాద్ : కానిస్టేబుళ్ల కళ్లతో ఆనందం తొనికిసలాడింది. జీతం పెరగడమే కాకుండా ప్రతినెల ఒకటో తేదీన జీతం అందుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పింది. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహించే హోంగార్డుల గౌరవ వేతనం 22 వేల రూపాయలకు పెరిగింది. ఇక నుంచి కానిస్టేబుళ్లతో సమానంగానే ప్రతీనెల ఒకటో తేదీనే హోంగార్డులకు వేతనాలు అందుతాయి. ఏప్రిల్ వేతనం మే 1న హోంగార్డుల ఖాతాలో జమ అయ్యాయి.
ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఏటా ఏప్రిల్లో హోంగార్డులకు వెయ్యి రూపాయల వేతనం పెంపు ఉంటుంది. పోలీసు శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే హోంగార్డులకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వేతనం పెంపుతోపాటు మరెన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డుల వేతనం కేవలం రూ. 12 వేలుగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2018 జనవరి నుంచి వారి వేతనాన్ని 20 వేల రూపాయలకు పెంచింది. ఏటా ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో 2018 ఏప్రిల్లో హోంగార్డుల వేతనం 21 వెల రూపాయలకి పెరిగింది.
2019 ఏప్రిల్లో మరో వెయ్యి పెరగడంతో ఇప్పుడు హోంగార్డుల వేతనం 22 వేల రూపాయలకు చేరింది. పోలీసుశాఖలో ఆయా విభాగాల్లో సుమారు 20 వేల మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఏటా వెయ్యి రూపాయలు పెంపు, ఒకటో తేదీనే గౌరవ వేతనం అందిస్తున్నందుకు సీఎం చంద్రశేఖర్ రావుకు, డీజీపీ మహేందర్ రెడ్డికి హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు.