హత్యకు 3నెలల నుంచి ప్లాన్: కూతుర్ని వదిలేస్తే రూ.3 కోట్లు.. ప్రణయ్కి అమృత తండ్రి ఆఫర్?
మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల యాదాద్రి జిల్లాలో స్వాతి - నరేష్లు ప్రేమించుకొని పెళ్లి చేయగా, వారిని నమ్మించి ముంబై నుంచి తీసుకు వచ్చిన అమ్మాయి తండ్రి.. నరేష్ను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నరేష్ హత్యకు గురి కావడంతో స్వాతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మిర్యాలగూడలో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రణయ్, అమృతలు ప్రేమ వివాహం చేసుకున్నారు.
పరువు హత్య?: యువకుడి ప్రాణం తీసిన ప్రేమ వివాహం
ప్రణయ్ను హత్య చేయడానికి అమృత తరఫు వారు 3 నెలల నుంచి ప్లాన్ వేస్తున్నారు. రూ.10 లక్షలతో కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నారు. పోలీసులు, జిల్లా ఎస్పీ పిలిపించి అమ్మాయి తండ్రిని హెచ్చరించినా మారలేదు. చివరకు అబ్బాయిని చంపేశారు. తమని కాదని వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆరు నెలల క్రితం పెళ్లి
ప్రణయ్, అమృతలు ఏడెనిమిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అమృత మూడు నెలల గర్భిణి. ప్రణయ్ను హత్య చేసే సమయంలో అమృత, ఇతర మహిళలు అరుస్తున్నట్లుగా ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. వారంతా సహాయం కోసం అరిచారు. కానీ దుండగుల దాడితో ప్రణయ్ సంఘటన స్థలంలోనే చనిపోయాడు.
పరారీలో నిందితులు
ఈ పెళ్లి రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలోనే అమృత చెప్పింది. ఇటీవల ప్రణయ్ తల్లిదండ్రులు మిర్యాలగూడలో డిన్నర్ ఏర్పాటు చేశారు. అమ్మాయి తరఫు బంధువులు రాలేదు. శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం అమృతను ప్రణయ్, ఆయన తల్లి ఆసుపత్రికి తీసుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఆసుపత్రిలో మాటు వేసిన దుండగుడు వెనకనుంచి వచ్చి అతడి మెడపై కత్తితో వేటువేశాడు. ప్రణయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగుడు మరో వేటు వేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హత్య తర్వాత అమ్మాయి తండ్రి మారుతి రావు, బాబాయి శ్రవణ్ పరారీలో ఉన్నారు.
కోపం లేనట్లు నటించి, భర్త మృతి తెలియని భార్య
కొంత కాలంగా కోపం లేనట్లు నటించి అమృతను నమ్మించారని, అల్లుడితో కలిసి ఇంటికి రావాలని తండ్రి అమృతను కోరగా, ఆమె నో చెప్పిందని అంటున్నారు. ప్రణయ్ హైదరాబాదులో ఉద్యోగం చేసేవాడు. మూడు నెలల క్రితం ఆ ఉద్యోగం మానేసి మిర్యాలగూడకు వచ్చాడు. అప్పటి నుంచి ప్రణయ్ హత్యకు మారుతిరావు, శ్రవణ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హంతకుడిని పట్టుకునేందుకు క్లూస్ టీం సభ్యులు, డాగ్స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టాయి. హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం సమయంలో అమృత, ప్రణయ్ తల్లి తిరిగి ఆసుపత్రిలోకి పరుగెత్తారు. షాక్కు గురైన అమృత అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణయ్ చనిపోయిన విషయం అమృతకు తెలియదని సమాచారం. హత్య జరిగే కంటే 45 నిమిషాల ముందు నుంచి వారు పరారీలో ఉన్నారట.
బీటెక్ నుంచి ప్రేమించుకున్నారు
అమృత, ప్రణయ్లు బీటెక్ నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లయ్యాక తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు నేపథ్యంలో వారు కూడా పిలిచి మందలించారు. దీంతో తండ్రి రివర్స్ గేర్లో వచ్చాడు. ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన నేపథ్యంలో అమ్మాయి తండ్రి మంచిగా ఉంటున్నట్లు నటించాడు. కూతురుతో రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు. పోలీసులు కూడా కలిసి ఉన్నారని భావించారు. వీరు మాత్రం మంచిగా ఉన్నట్లు నటిస్తూ మూడు నెలలుగా ప్లాన్ చేసి చంపేశారు.
ప్రేమను త్యాగం చేస్తే రూ.3 కోట్ల ఆఫర్?
అమ్మాయి తండ్రి, బాబాయి రూ.పది లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్. కొత్త కోణం వెలుగు చూసింది. ప్రణయ్, అఅమృతలు ప్రేమించుకున్న విషయం తెలియగానే అమ్మాయి తండ్రి మారుతీరావు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ప్రేమను భగ్నం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలో మారుతీరావు కుటుంబం సంపన్నమైన కుటుంబం. ప్రణయ్ ఫ్యామిలీ కూడా ఎగువ మధ్య తరగతి కుటుంబమే. తన కూతురును మరిచిపోవాలని ప్రణయ్కి మూడు కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. కానీ ప్రణయ్ అంగీకరించలేదట. విచారణలో ఈ నిజానిజాలు తేలనున్నాయి. మారుతీ ఇచ్చిన ఆఫర్ తిరస్కరించి ప్రణయ్, అమృతలు పెళ్లి చేసుకున్నారట.