ఒళ్లు జలదరించేలా: నవ్వుతూ.. కుక్క పిల్లల్ని మంటల్లో కాల్చేశారు
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ముషీరాబాదులో దారుణం జరిగింది. ఒళ్లు జలదరించే సంఘటన చోటు చేసుకుంది. ఆరుగురు విద్యార్థులు మూడు కుక్క పిల్లలను మంటల్లో సజీవ దహనం చేశారు. అవి మంటల నుంచి పారిపోతుంటే, పట్టుకొని మరీ కాల్చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అవి మంటల్లో కాలిపోతుంటే వారు ఆనందంతో నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో వెలుగు చూడటంతో జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కుక్కలను సజీవ దహనం చేసిన వీడియోను వారే తమ మొబైల్లో వీడియో తీసి, ఫేస్బుక్లో అప్ లోడ్ చేశారు. కుక్క పిల్లల పైన పైశాచికం ప్రదర్శించినట్లుగా అందులో ఉంది. ఇది పిచ్చికి పరాకాష్ట అంటున్నారు. ఆ పిల్లలకు ఇది ఆనందం కలిగించి ఉండవచ్చు. కానీ చేసింది మాత్రం చాలా దారుణమని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
వారు కుక్క పిల్లలను పట్టుకోవడం, అక్కడి నుంచి తీసుకు వచ్చి, మంట వేయడం, మంటల్లో ఆ కుక్క పిల్లలను వేయడం, అవి మంటలను తట్టుకోలేక బయటకు పారిపోతుంటే, పట్టుకొని మరీ అందులో వేయడం, చివరకు అవి సజీవ దహనం కావడం.. ఆ వీడియోలో ఉంది. వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.