కాళ్లు నరికేశారు: ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో మహిళ దారుణ హత్య, భద్రత ప్రశ్నార్థకం
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం(మెంటల్ హాస్పిటల్)లోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. కాళ్లు నరికేసి మెడకు ఉరేసి కడతేర్చారు. నరికిన పాదాలను ఆసుపత్రిలోని పురుషుల వార్డు భవనంపై విసిరేశారు.
ఆస్పత్రి ఆవరణలో..
ఈ ఘటనపై ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మానసిక చికిత్సాలయం వెనుక వైపు పురుషుల వార్డు ఆవరణలోని పొదల్లో సుమారు 45 ఏళ్ల మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికంగా ఉండే ఓ బాలుడు గుర్తించాడు.
కాళ్లను నరికేసి..
కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి, నరికిన కాళ్లను ఆసుపత్రి పురుషుల వార్డు భవనంపై కనుగొన్నారు. బుధవారం అర్ధరాత్రి హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. అత్యాచారం కూడా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
వెండి కడియాల కోసమేనా?
మృతురాలి చీర కొంగుతోనే మెడకు ఉరివేసి, కాళ్లకున్న వెండి కడియాల కోసమే కాళ్లు నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ మండలం డీసీపీ ఎ ఆర్.శ్రీనివాస్, పంజాగుట్ట ఏసీపీ విజయ్కుమార్, మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్, ఇతర వైద్యాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
సీసీ కెమెరాలు కూడా లేవు..
ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద తప్పించి, చుట్టూ ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో, కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఇన్పేషంట్ల రికార్డులను, ఆస్పత్రి నుంచి అదృశ్యమైన రోగుల జాబితాను తనిఖీ చేసినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఆమెను బయటి నుంచి ఆసుపత్రి వెనుకవైపున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
భద్రత లేదు, కబ్జా కోరల్లో ఆస్పత్రి
కాగా, మెంటల్ ఆస్పత్రి ఆవరణలోకి రాత్రి సమయాల్లో దుండగులు వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారని ఆస్పత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆస్పత్రిలో విధులు నిర్వహించాలంటేనే మహిళా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో సెక్యూరిటీని పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే, ఆస్పత్రికి చెందిన భూములు కూడా కొందరు కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.