పిచ్చికి పరాకాష్ట: హరికృష్ణ భౌతికకాయంతో ఆసుపత్రి సిబ్బంది సెల్ఫీ, 4గురిపై వేటు
Recommended Video
నల్గొండ: రెండ్రోజుల క్రితం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ భౌతికకాయంతో ఆసుపత్రి సిబ్బంది సెల్ఫీ దిగారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది ఆయన భౌతికకాయంతో సెల్ఫీ దిగడం చర్చనీయాంశంగా మారింది.
హరికృష్ణ భౌతికకాయంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, వార్డు బాయ్, వార్డు గర్ల్ సెల్ఫీ దిగారు. హరికృష్ణకు గాయాలు అయ్యాక నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు సెల్ఫీ దిగారు.
ఆ సెల్ఫీని వారు సోషల్ మీడియాలోను పోస్ట్ చేశారు. ఇది రాక్షసానందం అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీ దిగాలో కూడా తెలియదా అని నిప్పులు చెరుగుతున్నారు. చనిపోయిన సమయంలో మానవత్వం మరిచారా అని మండిపడుతున్నారు.
నలుగురిపై వేటు
కామినేని ఆసుపత్రిలో జరిగిన వ్యవహారంపై యాజమాన్యం స్పందించింది. తీవ్రంగా గాయపడిన హరికృష్ణతో సెల్ఫీలు దిగిన ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను కామినేని ఆసుపత్రికి తరలించినప్పుడు నలుగురు సిబ్బంది సెల్ఫీలు దిగారు. విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించి వారిపై వేటు వేసింది.