తమిళనాడులో తెలుగును బతికించాలని జయలలితకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
చెన్నై: తమిళనాడులో తెలుగును బతికించాలని తమిళనాడు రాష్ట్ర శాసన సభలో హోసూరు ఎమ్మెల్యే గోపినాథ్ ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు. తెలుగు, ఇతర మైనార్టీ భాషలను తమిళనాడులో బతికించండమ్మా అంటూ అర్జించారు.
తమిళనాడులో 2006లో డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళం పేరుతో జారీ చేసిన జీవోపై తెలుగు ఎమ్మెల్యే ఆన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను మాతృభాషలో చదువుకోనివ్వాలని కోరారు. అయితే తాము తమిళంకు వ్యతిరేకం కాదన్నారు.
తమ మాతృభాషను కూడా చదువుకుంటామన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కోరారు. అంతేగాక తమిళనాట మైనారిటీ భాషలైన తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ జీవోతో వందలమంది తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారన్నారు.
జీవో సాకుతో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో తెలుగు సబ్జెక్టును తీసేస్తున్నారని, తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా పెట్టడం వల్ల మార్కులు ఉండవన్న ఉద్దేశంతో తెలుగు విద్యార్థులు మాతృభాషను వదిలేస్తున్నారన్నారు.
2012లో సీఎం జయలలిత శాసనసభ సాక్షిగా తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగనివ్వబోమని తెలుగులోనే హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు విద్యార్థులకు మద్దతుగా మాట్లాడాలంటూ సభలో ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే వినతిపత్రాలు ఇచ్చారు.
కానీ ఆయన మాట్లాడుతున్న సమయంలో ఒక్కరు కూడా మద్దతివ్వలేదు. ప్రభుత్వం తెలుగు విద్యార్థుల మాతృభాషమను కాపాడేలా చర్యలు తీసుకోవాలని, కరుణానిధి తమిళం 50 మార్కులకు, విద్యార్థి మాతృభాషలో మరో 50 మార్కులకు పరీక్ష రాసేలా 2011లో జీవో జారీ చేశారని, కనీసం దానినైనా అమలు చేయాలని కోరారు.
మంత్రి వీరమణి స్పందిస్తూ... నిర్బంధ తమిళం విషయంలో తాము ఏం చేయలేమన్నారు. వాస్తవాల నిర్ధారణకు ఒక విచారణ సంఘాన్ని నియమించి పరిశీలించాలని గోపినాథ్ కోరారు. ప్రభుత్వం అంగీకరించక పోవడంతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు.
ఈ నెల 10న హైదరాబాద్లో తమిళనాడు తెలుగు సంఘాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్లో మంగళవారం ధర్నా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఇందిరాపార్కులో ఆ ధర్నా జరగనుంది.