దారుణం: అనుమానంతోనే భార్య హత్య, చంపేందుకే దుబాయ్ నుండి వచ్చిన భర్త
హైదరాబాద్: అనుమానం కారణంగానే భార్యను హత్య చేసిన భర్త తిరిగి దుబాయ్కు వెళ్ళిపోయాడు. ఇద్దరు భార్యలను వదిలేసి మూడో భార్యను వివాహం చేసుకొన్న ఆ నిందితుడు భార్యపై అనుమానం పెంచుకొన్నాడు. భార్యను హత్య చేసేందుకే దుబాయ్ నుండి వచ్చాడు. భార్యను నమ్మించి హత్య చేసి దుబాయ్కు పారిపోయాడు. అయితే ఈ ఘటనకు సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20వ తేదిన భార్యను హత్య చేసి డబీర్పురా రైల్వేస్టేషన్ ప్రాంతంలో గోనెసంచిలో అక్బర్ అలీ ఖాన్ అలియాస్ హైదర్ వేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 20వ, తేదిన డబీర్పురా రైల్వేస్టేషన్ ప్రాంతంలో గోనెసంచిలో మహిళ మృతదేహం దొరికింది. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించారు.
సీసీటీవి పుటేజీ ఆధారంగా గోనేసంచిలో జేబ నాజ్ అనే మహిళ శవం లభ్యమైంది. అయితే ఆమెను భర్తే హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో అక్బర్ అలీఖాన్ ను సహకరించిన వారిపై ఆరా తీసి మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అక్బర్ అలీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ దుబాయ్ కు వెళ్తోంది.
భార్యను హత్య చేయాలని ప్లాన్
కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన జేబ నాజ్ను డబీర్పురా ఫర్హత్నగర్కు చెందిన అక్బర్ అలీ ఖాన్ అలియాస్ హైదర్ వివాహం చేసుకొన్నాడు.. వివాహ అనంతరం కొన్నాళ్లకే అక్బర్ అలీ దుబాయికి వెళ్లడంతో జేబానాజ్ కింగ్కోఠిలోని పుట్టింటికి వెళ్లింది. దుబాయి నుంచి అప్పుడప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు కింగ్కోఠిలోనే భార్యతో ఉండేవాడు. జేబా నాజ్పై ఇరుగు పొరుగు వారి చెప్పిన చెప్పుడు మాటలతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
భార్య హత్య కోసం దుబాయ్ నుండి వచ్చాడు
ఇరుగుపొరుగు వారు చెప్పే మాటలు వినడంతో పాటు అక్బర్ అలీ ఖాన్ అలియాస్ హైదర్ తల్లి మెహబూబున్నీసా కూడ ప్రేరేపించిందని పోలీసులు తెలిపారు. దీంతో భార్యను హత్య చేసేందుకే మే 17వ తేదిన దుబాయ్ నుండి హైద్రాబాద్ కు వచ్చాడు. మే 19వ తేదిన అక్బర్ అలీఖాన్ అత్తగారింటికి వెళ్ళాడు. రంజాన్ సందర్భంగా పేదలకు దాన ధర్మాలు చేసేందుకు షాపింగ్ చేద్దామని భార్యను నమ్మించాడు. దీంతో పిల్లలను పుట్టింట్లోనే వదిలేసి భర్తతో పాటు ఆమె వచ్చింది.ఆమెను అతడి గదికి తీసుకెళ్లి సుత్తితో తలపై మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. మృతదేహాన్ని డబీర్పురా ఏడుగుళ్ల ప్రాంతంలోని రోడ్డు పక్కన పడేశాడు.
ఆటోలో భార్య శవం తరలింపు
హత్య చేసిన తన భార్య మృతదేహన్ని బయటపడేసేందుకు ఆటో కోసం ప్లాన్ చేశారు. అయితే తనకు మంచి జరిగేందుకు మేకను బలిచ్చానని ఆటో వాలాను నమ్మించాడు. బలిచ్చిన మేకను బయటపడేసేందుకు అద్దెకు మాట్లాడుకొన్నాడు. ఆటోవాలాకు రూ.5వేలు ఇస్తానని మాట్లాడుకొన్నాడు. అయితే కేవలం రూ.1500 మాత్రమే అతడికి ఇచ్చారు. భార్య మృతదేహన్ని ఆటోలో తీసుకెళ్ళి డబీర్పురా రైల్వేస్టేషన్ ప్రాంతంలో పారేశారు.
ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్తలు
భార్యను హత్యచేసిన తర్వాత అక్బర్ అలీ ఖాన్ అలియాస్ హైదర్ అదే రోజు రాత్రి దుబాయ్ కు వెళ్ళిపోయాడు. అయితే తన సోదరుల్లో ఒకరైన ఖైసర్ అలీఖాన్ దుబాయి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు.మరో ఇద్దరు సోదరులు ఉస్మాన్ అలీ ఖాన్, ఇమ్రాన్ అలీ ఖాన్ లు ఆధారాలు లభించకుండా గదిలోని రక్తపు మరకలను శుద్ధిచేశారు.అయితే అత్తింటికి వెళ్ళిన తన కూతురుకు ఫోన్ చేయడంతో స్విచ్చాఫ్ రావడంతో మృతురాలి తల్లి సకీనా బేగం డబీర్ పురావకు వచ్చి నిందితుడి కుటుంబసభ్యులను ప్రశ్నిస్తే తమకు తెలియదని వారు బుకాయించారు.