చంద్రబాబు తీరేందో అర్థం కాదు, కాంగ్రెస్ నాకేం చేసింది: డిఎస్ షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఏమిటో నాకు అర్థం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (అంతర్రాష్ట్ర) డి శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తానొక విజనరీ అని చెప్పుకనే చంద్రబాబు ఏపీ - టీల మధ్య సమస్యల పరిష్కారానికి ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలియదా అన్నారు. చంద్రబాబు తీరు ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు.
హైదరాబాదులోని సీమాంధ్రవాసులు.. తాము పక్కా తెలంగాణవారమని, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తామని చెబుతున్నారని డి శ్రీనివాస్ అన్నారు. కర్నాటక, మహారాష్ట్రలతో నీటి ప్రాజెక్టుల సమస్యలు ఉన్నాయని చెప్పారు.
కెసిఆర్ను ఏ రకంగా అభినందించాలో నాకు అర్థం కావడం లేదన్నారు. కెసిఆర్ చాలా ముందుచూపున్న నేత అన్నారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపాలన్నది కెసిఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి కెసిఆర్ రిటైర్ అవుతారని ఎవరూ అనుకోవద్దన్నారు. ఆయన ఎందుకు రిటైర్ అవుతారని ప్రశ్నించారు.
మనం తెలంగాణను ఇరవై, ఇరవై అయిదేళ్లలో అగ్రగామిగా నిలబెట్టాలనుకుంటే, కెసిఆర్ అయిదేళ్లలో అలా నిలబెట్టాలని కృషి చేస్తున్నారన్నారు. సదుద్దేశ్యంతో ముందుకు పోతే సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయని చెప్పారు.
అంతర్రాష్ట్ర సంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇరిగేషన్ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. సిఎం కెసిఆర్ కోరుకున్న విధంగా న్యాయబద్ధంగా సమస్యలను పరిష్కరిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు.
తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు.. తెలంగాణ మొదలు, ఆ తర్వాతే రాజకీయం అనేలా ఉండాలన్నారు. తెలంగాణను అందరం కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. తెలంగాణ సాధించుకున్న మాకు సమస్యలు పరిష్కరించుకోవడం తెలియదా అన్నారు.
కాంగ్రెస్ పైన విమర్శలు
రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు ఏం ఇచ్చిందని డి శ్రీనివాస్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ) కొత్తది కాదని, ముందు నుంచీ ఉందని చెప్పారు. పదవి రావాలంటే టాలెంటుతో పాటు అదృష్టం ఉండాలన్నారు. 2019లో టీఆర్ఎస్దే అధికారం అని చెప్పారు.