నేరాలు ఇలా తగ్గుతాయి, చట్టాలతో కాదు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సమాజంలో మార్పు వచ్చినప్పుడే నేరాలు తగ్గుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. చెడు దృష్టి లేనప్పుడు లైంగికదాడులు జరగవని తెలిపారు. ప్రతీ ఒక్కరిలో భయం, భక్తి ఉండాలని.. యువత విలువలు కాపాడాలని కోరారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులను వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు.
ఏదైనా ఘటన జరిగితే ఫిర్యాదు తీసుకొని విచారణ చేయడం పోలీసుల ప్రాథమిక విధి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కీచకులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పారు. వారిలో మార్పు రావాలె తప్ప.. చట్టాలతో పనిలేదని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలు తనని తీవ్రంగా కలచి వేస్తున్నాయని చెప్పారు. అన్నీరంగాల్లో సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని కోరారు.
సనాతన భారతీయత సంస్కృతి ఎంతో పురాతనమైనదని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. ప్రకృతి, సంస్కృతి భవిష్యత్ని నిర్ణయిస్తామని చెప్పారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు పాడుపడాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని గుర్తుచేశారు. సమస్యకు కారణం సంస్కృతిని వీడటమేనని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన ఘటనలు కలిచివేస్తున్నాయని చెప్పారు. పెద్దలకు గౌరవించడం కూడా లేదని.. దీంతో యువతతో క్రమశిక్షణ లోపిస్తుందని చెప్పారు. సంస్కృతిని కాపాడుకుంటే మంచి నడవడిక అలవడుతుందని అభిప్రాయపడ్డారు.