కేసీఆర్ సర్కార్..రెడీ టు ఫైట్: కేంద్రంతో సై అంటే సై: బీజేపీ బాస్పై ఈటెల్లాంటి మాటలు
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి తేల్చి పారేసింది. కరోనా వైరస్ పరిస్థితుల్లోనూ బీజేపీ సర్కార్పై ఘాటు విమర్శలతో విరుచుకుపడింది కేసీఆర్ సర్కార్. సై అంటే సై అనే స్థితికి చేరుకుంది. బీజేపీ నేతలకు కంటైన్మెంట్ అనే పదానికి కూడా అర్థం తెలియదని చురకలు అంటించింది. ఎద్దేవా చేసింది. కరోనా కాలంలో కూడా కమలనాథులు రాజకీయ ప్రయోజనాలను వెదుక్కుంటున్నారని పేర్కొంది.
Recommended Video
అన్ని రాష్ట్రాల కంటే ముందుగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా పసిగట్టింది తామేనని కరాఖండిగా తేల్చేసింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర ఆశించిన స్థాయిలో లేదని కుండబద్దలు కొట్టింది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న తొలి రోజుల్లో ఢిల్లీలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో సామూహిక మత ప్రార్థనల విషయంపై కేంద్రాన్ని అప్రమత్తం చేసింది తామేనని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు.
వెయ్యి వెంటిలేటర్లకు ఆర్డర్ ఇస్తే..
ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖలపై ఘాటు విమర్శలను గుప్పించారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చాటుతోందని ఆరోపించారు. తాము 1000 వెంటిలేటర్లను పంపించాలని ఆర్డర్ ఇస్తే.. ఐసీఎంఆర్ ద్వారా 50 మాత్రమే అందాలయని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణకు రావాల్సిన కరోనా పరికరాలు, యంత్రాలను కోల్కతకు మళ్లించారని చెప్పారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదా? అని ప్రశ్నించారు.
మా కాళ్ల మీద మేం నిలదొక్కుకున్నామంటూ..
కేంద్రం నుంచి ఎలాంటి మౌలిక, ఆర్థిక సహకారం లేకపోయినప్పటికీ.. కరోనా సంక్షోభ సమయంలో తమ కాళ్లపై తాము నిలదొక్కుకున్నామని అన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంటే బీజేపీ నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ ప్రభుత్వంపై చిల్లర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇది విమర్శలకు సమయం కాదని, అయినప్పటికీ.. బీజేపీ విమర్శలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
గుజరాత్లో కేసుల పెరుగుదలకు మోడీ బాధ్యత వహించగలరా?
కరోనాను నియంత్రించడంలో తమ ప్రభుత్వం విఫలమైందంటూ జేపీ నడ్డా చెప్పడం పచ్చి అబద్ధమని ఈటెల అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తాము మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని గుర్తు చేశారు. గుజరాత్లో వేల సంఖ్యలో నమోదవుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించగలరా? అని సవాల్ విసిరారు. పొరుగు దేశాల నుంచి వచ్చే వారి ద్వారానే కరోనా సంక్రమిస్తుందనే విషయాన్ని ముందే పసిగట్టామని, దీనిపై కేసీఆర్ ఆనాడే హెచ్చరించారని గుర్తు చేశారు.
కంటైన్మెంట్ జోన్లకు అర్థం తెలుసా?
కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఉండటానికి మొదటిసారిగా కంటైన్మెంట్ జోన్లను ప్రవేశపెట్టిన రాష్ట్రం తమదేనని, బీజేపీ నేతలకు కంటైన్మెంట్ అనే పదానికి అర్థం కూడా తెలియదని అన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సామూహిక మత ప్రార్థనల విషయంలోనూ కేసీఆర్ కేంద్రాన్ని అప్రమత్తం చేశారని అన్నారు. జేపీ నడ్డా వంటి జాతీయ స్థాయి నేతలు అబద్ధాలను ప్రచారం చేయడం సరికాదని, గల్లీ స్థాయి లీడర్ల తరహాలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రానికి సహకరించాం..
లాక్డౌన్ సమయంలో ప్రధాని సూచనల మేరకు తాము స్పందించామని, వీధుల్లోకి వచ్చి చప్పట్లు కొట్టామని, దీపాలను వెలిగించి సంఘీభావాన్ని ప్రకటించామని అన్నారు. బీజేపీది నీచ సంస్కృతి అని, శవాల మీద పేలాలు ఏరుకునే స్వభావం అంటూ ఈటెల విరుచుకుపడ్డారు. దేశమంతా కరోనాపై పోరాడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ఐసీఎంఆర్ ప్రతీసారీ మార్గదర్శకాలను మార్చిందని, దీనివల్ల ఎవరికి లాభమని అన్నారు.