అమిత్ షాకు కౌంటర్: పురంధేశ్వరిని లాగి ధీటైన జవాబిచ్చిన హరీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రం ఇచ్చిన నిధులతో విపక్షాలైన కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీల ఎమ్మెల్యేలను కొంటోందని వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు తెరాస కౌంటర్ ఇస్తోంది. ఆదివారం సాయంత్రం మంత్రి హరీష్ రావు దీటైన సమాధానం ఇచ్చారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను తాము కొంటున్నామని అమిత్ షా చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. అలాగే, మాజీ కేంద్రమంత్రులు పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావులను ఆయన లాగారు. కావూరి, పురంధేశ్వరిలను బీజేపీలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
అలాగే, మజ్లిస్ పార్టీకి, ఓవైసికి భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదన్న వ్యాఖ్యలకు కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఎవరికో భయపడి విమోచన దినం జరపడం లేదని అమిత్ షా మాట్లాడటం విడ్డూరమన్నారు. కేసీఆర్ మొండిఘటమని, ఎవరికీ భయడపడని వ్యక్తి అన్నారు.
అందుకనే, పద్నాలుగేళ్లు పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ ఎవరికీ భయపడని నాయకుడు అన్నారు. ఈ విషయాన్ని అమిత్ షా గుర్తించాలన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచి, ముఖ్యమంత్రులను దించి సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న ఘనత బీజేబీది అన్నారు.
పార్టీ ఫిరాయింపుల గురించి బీజేపీ మాట్లాడటం దారుణమన్నారు. కేంద్రమంత్రులుగా ఉన్న పురంధేశ్వరి, కావూరిలకు ఎన్ని కోట్లు ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, హైకోర్టు విభజన గురించి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర బీజేపీదే అన్నారు. ఆరు మండలాలతో పాటు లోయర్ సీలేరు, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను తెలంగాణా కోల్పోయిందని, గిరిజనులను నిరాశ్రయులను చేసి పోలవరం ప్రాజెక్టు కడుతున్నారంటూ ఆయన విమర్శించారు.
తెలంగాణ వాటా కింద ఇచ్చింది రూ.47 వేల కోట్లు మాత్రమే అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుల కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను రెట్టింపుగా ఉంటుందన్నారు. అవసరమైతే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అడిగితే తెలంగాణ ప్రజలు ఎంత పన్నులు కట్టారో తెలుస్తుందన్నారు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు.