సింగరేణి బోనస్ ఎలా చెల్లిస్తారు..? అప్పుచేస్తారా..? అని కేసీఆర్కు లక్ష్మణ్ ప్రశ్న
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డికి ఆ పార్టీపై నమ్మకం లేదన్నారు. ఒకవేళ రేవంత్ ఇచ్చే ఆధారాలను తాము స్వీకరిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఓనర్లు, కిరాయిదారుల పంచాయతీ ఉండగా కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్- కొత్త కాంగ్రెస్ అని తెరపైకి వచ్చిందన్నారు. ఇటు కేసీఆర్పై కూడా విమర్శలు గుప్పించారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇటు కేసీఆర్పై విమర్శలు చేశారు. సింగరేణి కార్మికులు 30 శాతం బోనస్ ఆశించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 28 శాతం ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం చేసిన అప్పులతో సింగరేణి సంస్థ ఇబ్బందులు పడుతుందన్నారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు.
సింగరేణికి చెందిన ఆస్పత్రిలో వైద్యులు కూడా అందుబాటులో లేరన్నారు. కార్మికులు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. సింగరేణి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటిచ్చి తప్పారని విమర్శించారు. సింగరేనికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు బకాయి పడిందని పేర్కొన్నారు. బోనస్ డబ్బులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. అప్పు చేస్తారా అని నిలదీశారు.