రోహిత్ ఆత్మహత్య: ఇరానీకి సంబంధం లేదా, ఆ ఆరు లేఖలు ఏం చెబుతున్నాయి?
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) వ్యవహారాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంటున్నారు. అది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ, మానవ వనరుల శాఖకు సంబంధించిన ఐదు లేఖలు మాత్రం రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాలను బయటపెడుతున్నాయని అంటున్నారు.
వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆరు లేఖలు వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలు అతి కీలకంగా మారాయి. ఈ ఆరు లేఖల్లో ఐదు లేఖలు స్మృతి ఇరానీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) నుంచి రాశారు.
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో హెచ్చార్డీ రాసిన ఈ లేఖల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఫిర్యాదుపై ప్రతిస్పందన ఏమిటో తెలియజేయాలని హెచ్సియూ యాజమాన్యాన్ని కోరింది. బిజెపి విద్యార్థి విభాగం ఎబివిపి కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంపై ఐదుగురు విద్యార్థులను హెచ్సియు యాజమాన్యం బహిష్కరించింది. ఆ ఐదుగురిలో రోహిత్ ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎబివిపి విద్యార్థిపై దాడికి సంబంధించి ఏ విధమైన ఆధారం లభించలేదని విశ్వవిద్యాలయానికి చెందిన కమిటీ స్పష్టం చేసింది. దత్తాత్రేయ స్మృతి ఇరానీకి రాసిన లేఖ తర్వాత ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హెచ్సియూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందని దత్తాత్రేయ తాను రాసిన లేఖలో ఆరోపించారు.
దత్తాత్రేయ ఫిర్యాదును హెచ్చార్డీ విశ్వవిద్యాలయానికి పంపించి, ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఓ ఈమెయిల్తో పాటు నాలుగు లేఖలను రాసింది. విఐపి రెఫరెన్స్గా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లేఖపై కామెంట్స్ కోరుతూ సెప్టెంబర్ 3వ తేీదన హెచ్చార్డీ విశ్వవిద్యాలయానికి ఈమెయిల్ పంపించింది.
సెప్టెంబర్ 24, అక్టోబర్ 6, 20, నవంబర్ 19 తేదీల్లో మరోనో నాలుగు లేఖలను విశ్వవిద్యాలయానికి పంపించింది. ఈ లేఖల్లోని సారాంశం దత్తాత్రేయ రాసిన లేఖలోని అంశాలను ప్రతిబింబిస్తున్నాయని మీడియా వ్యాఖ్యానించింది. మొత్తం మీద స్మృతి ఇరానీకి కూడా హెచ్సియూ పరిణామాల బురద అంటుకుంది.