హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో బాంబు పేలుడు... ఉలిక్కిపడ్డ స్థానికులు... ఒకరి అరెస్ట్...
హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో మంగళవారం(మే 11) రాత్రి బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానిక జయరాంనగర్ చౌరస్తా వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. భారీ పేలుడు శబ్దానికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ బ్యాగ్ను తీసుకెళ్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఎవరు... బ్యాగ్లో పేలుడు పదార్థాలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడన్నది తేలాల్సి ఉంది. అసలే జనం కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వేళ... ఈ పేలుడు ఘటన స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది.
ఇక రాష్ట్రంలో బుధవారం(మే 12) నుంచి 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీపీలు,ఎస్పీలు,డీఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో లాక్డౌన్ను పటిష్టంగా అమలుచేయాలన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రెండో డోసు వ్యాక్సిన్ కోసం వెళ్లేవారికి మొదటి డోసు వేసుకున్న సమాచారాన్ని చూపిస్తే అనుమతినివ్వాలన్నారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల రవాణా,అత్యవసర సేవలకు పాసులు జారీ చేయాలని డీజీపీ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు,మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలన్నారు. వివాహాది శుభాకార్యాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పాసుల కోసం https://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. లాక్డౌన్ సడలింపు వేళల్లో ప్రయాణాలకు పాసులు అవసరం లేదన్నారు.