ఖమ్మంలో "కమ్మ"ని పోరు..! నువ్వా నేనా అనుకుంటున్న మాజీ ఎంపీలు..!!
ఖమ్మం/ హైదరాబాద్ : ఖమ్మం ఎంపీ సీటు రసకందాయంలో పడింది. స్థానికులే కాకుండా స్థానికేతరులు సైతం అక్కడి టికెట్ పై ఆశలు పెట్టుకోవడం ఒక ఎత్తైతే అక్కడి మాజీ ఎంపీల మద్య నెలకొన్న పోరు మరో ఎత్తుగా పరిణమించింది. ఇదే క్రమంలో మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రేణుకాచౌదరి ఖమ్మం టికెట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేతలిద్దరూ తమ పార్టీ శ్రేణులతో సమావేశమై కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ, తెలంగాణలో కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నడుచుకోవాలని అధినేత చంద్రబాబు సూచించారన్నారు. 'మహాకూటమితోనే ముందుకెళ్దాం. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్నే అనుసరిస్తే అదికార గులాబీ పార్టీని కట్టడి చేయొచ్చు' అని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డట్టు తెలిపారు.
ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని నామాను కోరగా.. అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పొలిట్బ్యూరోలో వెల్లడిస్తానని, పార్టీ నిర్ణయానికి శ్రేణులు కట్టుబడి ఉండాలని నామా తెలిపారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్కు విన్నవించారు.
కార్పొరేటర్ నాగండ్ల దీపక్చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో సలీమ్ అహ్మద్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆమెకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని చెప్పారు. దీంతో ఖమ్మం పార్లమెంట్ సీటుపై మునుపెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. అదికార గులాబీ పార్టీ అక్కడ బలహీనంగా ఉండడంతో గెలుపు పై కన్నేసిని ప్రతిపక్ష పార్టీలు ఆ దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వర రావు, రేణుక చౌదరి ల మద్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది.