భక్తుల కొంగు బంగారం మేడారం సమ్మక్క సారక్క..! పోటెత్తుతున్న జనం..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం జాతరకు భక్తుల తాకిడి రెట్టింపవుతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలనుండి మేడారం జాతరకు తరలి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తుల సౌకర్యం కోసం రవాణా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు.
అంతే కాకుండా తెలంగాణ చుట్టుపక్క ప్రాంతాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశ్శా, ఆంధ్ర ప్రదేశ్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు వస్తుంటారు. సుమారు కోటీ యాభై లక్షల మంది ఈ జాతరకు తరలి రానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు సరిపోవు సౌకర్యాలతో పాటు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ రంగ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అంతే కాకుండా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని ముఖ్య ఘట్టాలు శుక్ర, శని వారాల్లో చోటుచేసుకోనున్న నేపథ్యంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ నలు మూలలనుండి భక్తులను జాతరకు చేరవేసేందుకు వినూత్న సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
శుక్ర వారం వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలు గద్దె మీదకు చేరుకుంటారు. అశేష భక్తులు అప్పుడే తమ మొక్కులను చల్లించుకోవడంతోపాటు దేవతలకు అత్యంత ప్రియమైన బంగారాన్ని (బెల్లం)సమర్పించుకుంటారు. ఆ మరుసటి రోజున గద్దెల మీద కొలువుదీరిన అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు.
దీంతో జాతర ముగింపు దశకు చేరుకుంటుంది. భక్తులు మళ్లీ యధావిధిగా స్వస్థలాలకు చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా శుక్రవారం రోజున మేడారం జాతరలో అమ్మవార్లను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.