రోడ్లపై వ్యర్థాలు వేస్తే ఖబర్దార్..! గుట్కా వేసుకుని తుపుక్కున ఉమ్మితే భారీ మొత్తంలో జరిమానా..!!
హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వ నగరం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతే కాదు సింగపూర్ దేశంలోని కఠిన నిర్ణయాలను కూడా అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది నగర పాలక సంస్థ. నగరం ఎంత పరిశుభ్రంగా ఉంటే చూసే వారికి గాని, యాత్రికులకు గాని అంత ఆహ్లాదంగా ఉంటుంది. దీన్నే ఆసరా చేసుకుని మున్సిపల్ అదికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. పరిశుభ్రంగా ఉండాల్సిన రహదారుల్లో చెత్త చెదారం వేస్తే కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్దం చేస్తోంది నగర పాలక సంస్థ.
చెత్త వేయడమే కాకుండా నోటీ నిండా గుట్కా వేసుకుని తుప్పుక్కున ఉమ్మేసే వాళ్ల భరతం పట్టేందుకు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది జీహెచ్ఎంసీ.రోడ్లపై ఇష్టానుసారంగా భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. రోడ్లపక్కన చెత్త వేస్తున్న ఇద్దరికి మంగళవారం 40 వేల రూపాయల జరిమానా విధించారు.
చందానగర్ వెంకటాద్రి కాలనీకి చెందిన రవీందర్రెడ్డి భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు 30 వేల రూపాయల జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయడంతో పాటు డస్ట్బిన్లను సైతం ఏర్పాటు చేసుకోకపోవడంతో మూసాపేటలోని సాయి బాలాజీ వైన్స్కు 10 వేల రూపాయల జరిమానా విధించారు. నగరంలో రోడ్డుపై వెలుతూ ఉమ్మితే ఇక జరిమానా విధించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారులు చర్చించారు.
ఇకనుంచి అమలుఅవుతుందని కొన్ని రోజుల క్రితం బాగ్యనగరం జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి వెళ్తుండగా డ్రైవర్ జగదీశ్ రోడ్డుపై ఊసాడు. దీంతో పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైవర్ కు జరిమానా విధించారు. దీంతో జరిమానా వంద రూపాయలను డ్రైవర్ చెల్లించాడు.