వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ టైర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ టైర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. టైర్ రీబటన్ కంపెనీ సహా భారీ ఎత్తున టైర్లు మంటల్లో దగ్ఘమయ్యాయి.
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై సమాచారం తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్లు సమాచారం.
కాగా, ఇటీవల సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేటలో ఓ ఐదు అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి అంతస్తులో మొదలైన మంటలు ఐదంతస్తులకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇటీవలే ఆ భవనాన్ని కూల్చి వేశారు.