మోత్కుపల్లికి పెద్ద ఎత్తున నజరానా..
Recommended Video
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జాతకం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు పైన ఆయన చూపించిన ప్రతాపానికి ఇతర పార్టీల నుండి ' పెద్దమొత్తంలో ' ఆదరణ లభించినట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుతో విభేదించి పార్టీనుండి సాదాసీదాగా బయటకు వస్తే ఇంత సంచలనం అయ్యి ఉండేది కాదేమో..!! చంద్రబాబును కడుపునిండా, కసి తీరా దూషించినందుకు మోత్కుపల్లి నర్పింహులు ఇతర పార్టీల నేతల 'దృష్టి'ని ఆకర్షించగలిగారు.,ఇంటి వరకు రప్పించుకోగలిగారు. ఇతర పార్టీల నేతలు ఇంటి వరకు వస్తే అందులో వింతేముంది అని అనుకోవచ్చు..! అసలు మతలబు అందులోనే దాగుంది. మోత్కుపల్లి ఇంటికి చక్కర్లు కొడుతున్న నాయకుల అంతరార్థం మరోలా ఉంది.
ఏపీలో బాబును దూషిస్తే మోత్కుపల్లికి ప్రోత్సహకాలు.. విజయసాయి రెడ్డి తో భేటీ సారాంశం అదేనా..
శత్రువును చావు దెబ్బకొడుతున్న మరో శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటే అందులో ఉన్న కిక్కే వేరబ్బా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు మోత్కుపల్లిని కలిసిన రాజకీయనేతలు. మోత్కుపల్లికి చంద్రబాబు పైన ఉన్న ఆగ్రహం అంత తొందరగా చల్లారకుండా ఉండేందుకు అనేక 'తాయిలాలు' సిద్దం చేసి మోత్కుపల్లకి చేరవేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మోత్కుపల్లితో ఎలాంటి సంభందంలేని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఆయనను మచ్చికచేసుకుని 'మర్యాదలు' చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మే 28న బహిష్కరణకు గురైన మోత్కుపల్లి ఇన్ని రోజులు ఇతర పార్టీలతో 'కూడికలు, తీసివేతలు' సరి చూసుకుని ఈ నెల 23, 24 తేదీల్లో తిరుపతి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.
మనోభావాలు దెబ్బతీసిన మోత్కుపల్లిని ఏపి తెలుగు తమ్ముళ్లు స్వాగతిస్తారా..
తిరుపతిలో వెంకన్నస్వామిని దర్శించుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను వివరించబోతున్నారు మోత్కుపల్లి. అంటే ఆంద్ర లో ఎన్ని రోజులు పర్యటించాలి, ఎక్కడెక్కడ బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబును ఏవిదంగా దూషించాలి అనే కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తారు. ఇంత వరకు కథ, స్రీన్ ప్లే బాగానే ఉన్నప్పటికి.. సినిమా ప్రదర్శన పైనే సందేహాలు నెలకొన్నాయి. ఏపిలో మోత్కుపల్లి పర్యటన సజావుగా సాగుతుందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. అందునా ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా కేవలం చంద్రబాబును దూషించడానికే ఏపీ లో పర్యటించబోతున్న మోత్కుపల్లి పర్యటన ఎలాంటి అవరోధాలు లేకుండా సజావుగా ముందుకెళుతుందా..? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేయాలని అసందర్బ వాఖ్యలు చేసి తెలుగుతమ్ముళ్ల మనోభావాలను గాయపరిచిన మోత్కుపల్లి పట్ల ఆంద్ర తెలుగుదేశం శ్రేణులు ఉదాసీనత చూపిస్తాయా..?
ఏపీలో మోత్కుపల్లికి పరాభవం తప్పదంటున్న టీడిపి శ్రేణులు..
విభజన హామీల అమలు విషయంలో కేంద్రంతో విభేదిస్తున్న తరుణంలో ఇదే తిరుమలకు వచ్చిన బీజెపీ జాతీయ అద్యక్షుడు అమీత్ షా కు ఏపి ప్రజలు ఎలాంటి అనుభవాన్ని అందించారో అందరికి తెలిసిందే..! అలాంటిది ఏపిలో అందునా టీడిపి ఇలాకాలో చంద్రబాబును దూషిస్తుంటే తెలుగుతమ్ముళ్లు చోద్యంచూస్తుంటారా..? ఇవే పరిణామాలపై మోత్కుపల్లి ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిదనే చర్చకూడా జరుగుతోంది. నిజానికి మోత్కుపల్లి తెలంగాణ తెలుగుదేశం పార్టీని విలీనం చేయాలని వాఖ్యలు చేసినప్పుడు గాని, ముద్రగడను కలిసినప్పుడు గాని, ఆ తర్వాత చంద్రబాబును పరుషపదాలతో దూషించినప్పుడు గాని, విజయసాయి రెడ్డి ని కలిసినప్పుడు గాని ఒక్కసారి కూడా చంద్రబాబు స్పందించలేదు. తన సహచర నాయకులతో ప్రతివిమర్శలు చేయించలేదు.
మోత్కుపల్లి అంశంలో చంద్రబాబు సంయమనం..' హద్దులు ' దాటుతున్న మోత్కుపల్లి..
మోత్కుపల్లి విషయంలో ఎంత సంయమనం పాటించాలో అంతకన్నా ఎక్కువ సహనాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. అలాంటిది పనికట్టుకుని చంద్రబాబు సామ్రాజ్యంలోకి ప్రవేశించి దూషిండం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే ననే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ పరిదిలో పార్టీతో పాటు చంద్రబాబుపై ఎంత అనుచిత వాఖ్యలు చేసినా మోత్కుపల్లి సీనియారిటీకి గౌరవం ఇచ్చి ఏ కార్యకర్త కూడా ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడా స్పందించలేదు. అదే ఏపీలో ఎందుకు సహనం పాటించాలని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మోత్కుపల్లి తో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపిలో పర్యటింపజేసి తద్వారా లబ్ది పొందాలని చూస్తున్న 'ప్రాయోజిత' పార్టీలకు పరాభవం మాత్రం తప్పేట్టు కనిపించడం లేదు. అంతే కాకుండా లాజిక్ లేకుండా టీడిపి కి వ్యతిరేకంగా ఏపిలో పర్యటిస్తానని చెప్తున్న మోత్కుపల్లి సుధీర్గరాజకీయ అనుభవానికి కూడా విలువలేకుండాపోతుందని టీడిపి శ్రేణుల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.