తెలంగాణకు కేంద్రం ఆర్థిక చేయూత..! భారీగా నిధుల విడుదల..!!
Recommended Video
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి బీజేపి కేంద్ర సర్కార్ తగినంత ఆర్థిక చేయూత అందిస్తోంది. రాజకీయ వైషమ్యాలు రగలుతున్నప్పటికి ప్రజా సంక్షేమం కోసం, సత్వర అభివృద్ది కోసం ఆర్థిక సహాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో గులాబీ పార్టీ, బీజేపిలు పరస్పరం విమర్శించుకుంటూనే ఉన్నాయి. అదికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేది బీజేపి మాత్రమే నని, వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీని ఓడించేది బీజేపి మాత్రమేనని గత కొన్ని రోజులుగా బీజేపి చెప్పుకొస్తోంది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపి నాలుగు సీట్లలో గెలుపొందిన అంశాన్ని గులాబీ ముఖ్య నేతలు మర్చిపోవద్దని రాష్ట్ర బీజేపి హెచ్చరికలు కూడా పంపిస్తోంది. ఐతై తెలంగాణ బీజేపి అదికారంలోకి వస్తామని పగటికలలు కంటోందని గులాబీ పార్టీ కొట్టి పారేస్తోంది. నాలుగు సీట్లు గెలుచుకున్నంత మాత్రాన అదికారం చేపడతామని చెప్పడం హాస్యాస్పదమని గులాబీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపి పరిస్థితి ఇలా అగ్గిమీద గుగ్గిలం లాగా ఉంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల తీరు అందుకు విరుద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీజేపి ఏతర రాష్ట్రాల పట్ల కేంద్ర బీజేపి తన పంథం మార్చుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ చట్టం (కంపా) కింద తెలంగాణకు కేంద్రం 3,110 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పర్యావరణ భవన్లో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న అడవులను వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు చేయడానికి అవసరమైన పథకాలపై సమావేశంలో చర్చించినట్టు మంత్రి పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి కూడా నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఇదే అంశం పట్ల తెలంగాణ బీజేపి స్పందించాల్సి ఉంది.