మేడారం జాతర: పోటెత్తిన భక్తులు, 5-8 వరకు మహా జాతర
ములుగు: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు ఇప్పటి నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం భారీగా తరలివచ్చిన భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కాగా, ఫిబ్రవరి 5-8వ తేదీ వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. అయితే, జాతర సమయంలో రద్దీ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉండటంతో.. ముందస్తుగానే భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.
భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి మేడారం చేరుకున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఇక భద్రతా ఏర్పాట్లపై పోలీసులు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలు అధికారులను ఆదేశించారు.
కాగా, మేడారం జాతర భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది.
కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది.
భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపు తున్నాయి.