కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ : గుత్తాతో పాటే 'క్యూ'లో వివేక్, సురేష్ రెడ్డి..!
మెదక్ : గతకొద్ది రోజులుగా కాంగ్రెస్ కి భారీ షాక్ తగలబోతుందన్న ఊహాగానాలను నిజం చేస్తూ.. పార్టీ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలోనే కారెక్కడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇటీవలే గులాబీ బాస్ కేసీఆర్ నుంచి గుత్తాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న వార్తల నేపథ్యంలో, తాజాగా కేసీఆర్ ఫాంహౌజ్ లో గుత్తా ఆయన్ను కలవడం ఇక రేపో మాపో గుత్తా గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న సంకేతాలను పంపిస్తోంది.
ఇదిలా ఉంటే.. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ కి మరో ఊహించని షాక్ కూడా తగలబోతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఎంపీ గుత్తాతో పాటు కాంగ్రెస్ కురువ్రుద్దుడు జి.వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ కూడా కేసీఆర్ ఫామ్ హౌజ్ కి వెళ్లి మంతనాలు జరపడమే.
ప్రస్తుత రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ ఇద్దరూ గులాబీ గూటికి చేరేందుకే కేసీఆర్ ని కలిశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కేసీఆర్ కూడా ఈ ఇద్దరు బ్రదర్స్ ఎంట్రీ పట్ల సానుకూలంగానే స్పందించాడని సమాచారం.
అలాగే మరో కాంగ్రెస్ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి కూడా వీళ్లతో పాటే కేసీఆర్ ఫాంహౌజ్ కి వెళ్లారని తెలుస్తోంది. పార్టీ మార్పు ప్రయత్నాల్లో భాగంగానే ఆయన కూడా గుత్తా, వివేక్, వినోద్ వెంట ఫామ్ హౌజ్ కి వెళ్లారనే వాదన వినిపిస్తోంది.
ఇకపోతే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ లో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వివేక్, వినోద్, సురేష్ రెడ్డి కూడా త్వరలోనే గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు పలువురు. ఏదైమైనా జరుగుతున్న పరిణామాలు మాత్రం కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసేలాగే తయారయ్యాయి.