ఆస్పత్రిలో లుంగీ మూట... విప్పి చూస్తే పుర్రె,ఎముకలు,కళ్లు.. షాక్ తిన్న సిబ్బంది...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మూట తీవ్ర కలకలం రేపింది. మనిషి పుర్రె,చేతి ఎముక,పళ్లు అందులో బయటపడటంతో సిబ్బంది షాక్ తిన్నారు. అయితే ఇది పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు కొంతమంది సిబ్బంది చెప్పగా... అలాంటిదేమీ లేదని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆస్పత్రిలోకి ఆ మూట ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారన్నది సస్పెన్స్గా మారింది.
జనరేటర్ గదిలో మూట...
ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం... పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో సోమవారం(జనవరి 4) విధులకు వచ్చిన సిబ్బంది,అధికారులు ఏదో దుర్వాసన వస్తున్నట్లు పసిగట్టారు. అయితే అది ఎక్కడినుంచి వస్తుందన్నది కొద్దిసేపటి వరకూ అంతుచిక్కలేదు. కాసేపటికి ఆస్పత్రిలో జనరేటర్ ఏర్పాటు చేసిన గది నుంచి ఆ వాసన వస్తున్నట్లు గుర్తించారు. దీంతో సిబ్బంది చేత ఆ గదిని తనిఖీ చేయించగా అందులో ఒక మూలకు లుంగీతో చుట్టిన మూట కనిపించింది.
పుర్రె,ఎముకలు,కళ్లు...
సీహెచ్సీ శానిటేషన్ సూపర్వైజర్ దుర్గా, వార్డు బాయ్ కలిసి ఆ మూటను విప్పి పరిశీలించారు. అందులో ఓ బాక్స్ బయటపడగా దాన్ని తెరిచారు. లోపల ఒక ప్లాస్టిక్ డబ్బా,ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. ఆ డబ్బాలో మనిషి పుర్రె,చేతి ఎముక,కళ్లు,పళ్లు కనిపించాయి. దీంతో సిబ్బంది షాక్ తిన్నారు. వీటిని నాలుగైదు రోజుల క్రితం మృతి చెందిన శవం అవశేషాలుగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మూటను మార్చురీ గదిలో భద్రపరిచారు.
Recommended Video
ఎవరు తీసుకొచ్చి ఉంటారు?
ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ మూటను ఎవరు తీసుకొచ్చారన్నది నిర్దారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అయితే ఆస్పత్రికి చెందిన కొంతమంది సిబ్బంది.. ఆ మూటను పోస్టుమార్టమ్ నిమిత్తం తీసుకొచ్చారని చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పినట్లు సమాచారం. ఇక ఆస్పత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు ఈ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. తాను వేరే మీటింగ్లో ఉండటం వల్ల ఆ వివరాలు తెలియరాలేదన్నారు.