‘కిక్కు’ అదిరింది -ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేసారు : స్టాక్ లేక దిగుమతి..!!
దసరా అంటే ఆ కిక్కే వేరు. ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేశారు. కేవలం అయిదు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ 685 కోట్ల ఆదాయం వచ్చింది. సరుకు చాలకపోవడంతో బయట నుంచి తెప్పించారు. గత రెండేళ్లుకగా దసరా పండుగ పైన కరోనా ప్రభావం పడింది. నిబంధనల కారణంగా ఎవరికి వారు తమ ఇళ్లళ్లోనే పండుగ చేసుకున్నారు. ఈ సారి దసరా కరోనాకు ముందు ఏ విధంగా చేసుకున్నారో..అదే తరహాలో నిర్వహించుకున్నారు. ఇక, దసరా సందర్భంగా ఒక్కరోజే దాదాపు రూ.180 కోట్ల మద్యాన్ని దిగుమతి చేసుకోగా.. గతంలో ఉన్న స్టాక్తో కలిసి రూ.200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తేల్చారు.
దసరా వేళ..కిక్కు అదిరింది
ఈ సారి దసరా వేళ.. అయిదు రోజుల్లోనే రూ 685 కోట్ల మేర అమ్మకాలు జరగటం రికార్డుగా చెబుతున్నారు. గత ఏడాది ఈ అమ్మకాలు రూ.406 కోట్ల దాకా జరిగాయి. కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన రోజు రూ.130 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు సాగాయి. ఈ సారి దసరా తెలంగాణ ప్రభుత్వానికి అంచనా కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం తెచ్చి పెట్టింది. ఐదు రోజుల్లోనే 7.90 లక్షల కేసుల లిక్కర్, 8.34 లక్షల కేసుల బీరు అమ్మకాలు సాగాయి.
జిల్లాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు
రంగారెడ్డి జిల్లాలో రూ.58 కోట్లు, హైదరాబాద్లో రూ.42 కోట్ల మద్యం విక్రయాలు సాగినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, కరీంనగర్ జిల్లాల్లో మూడు రోజుల్లోనే రూ.29 కోట్లు, ఖమ్మంలో రూ.27 కోట్ల మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో గత 12 రోజుల్లో 1,430 కోట్ల విలువైన 17.20 కోట్ల కేసుల లిక్కర్, 16.27 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా హైదరాబాద్ రెండు డిపోల్లో కలిపి రూ.190 కోట్లు, హనుమకొండ రెండు డిపోల్లో రూ.155 కోట్లు, రంగారెడ్డి రెండు డిపోల్లో రూ.194 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ఈ నెలలో భారీగా మద్యం ఆదాయం
నల్లగొండలో రూ.128 కోట్లు, మేడ్చల్లో రూ.103 కోట్లు, కరీంనగర్లో రూ.94 కోట్లు, ఖమ్మంలో రూ.90 కోట్లు, మహబూబ్నగర్లో రూ.72 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రూ.487 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో..అక్టోబర్ చివరికి దాదాపుగా మరో రూ 1600 కోట్ల మేర విలువైన మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.
ఎక్సైజ్ రెవిన్యూ జోష్
2020 అక్టోబర్ మాసంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రూ 2,623 కోట్ల మేర జరిగాయి. కాగా, ఈ ఏడాది అది మూడు వేల కోట్లను దాటే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దిగుమతి చేసుకొని మరీ సరఫరా చేయాల్సిన స్థాయిలో దసరా అమ్మకాలు పెరగటం ఎక్సైజ్ శాఖకు మాత్రం ఫుల్ జోష్ ను ఇస్తోంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలోనూ భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.