హైదరాబాద్లో లాక్డౌన్..బ్రేక్డౌన్: పోలీస్స్టేషన్ల చుట్టూ వందలాది మంది యువత పోలీసులపైనా ఎగబడి
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా చుట్టబెడుతోందో రోజూ చూస్తూనే ఉన్నాం. వేలాదిమందిని ఈ మహమ్మారి ఏ రకంగా కొరికి తిని పారేస్తోందో తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ వైరస్ను నియంత్రించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి రెండే రెండు మార్గాలు. ఒకటి.. లాక్డౌన్, రెండు సోషల్ డిస్టెన్సింగ్. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సంక్రమించకుండా ఉండాలంటే ఈ రెండు పనులు చేస్తే చాలంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
మనోళ్లు వింటేగా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రజలు ఇళ్లపట్టునే ఉంటూ.. స్వీయ గృహనిర్బంధాన్ని పాటిస్తోన్న వేళ..బుధవారం నాడు హైదరాబాద్లో దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరి నిల్చున్నారు. ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లడానికి అవసరమైన అనుమతి పత్రాల కోసం వారు పోలీస్ స్టేషన్ల వద్ద ఎగబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే తన్నులాటకు దిగారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. పోలీసులని కూడా చూడలేదు. వాళ్ల చేతుల్లో ఉన్న అనుమతి పత్రాల కోసం లాక్కోవడానికి ప్రయత్నించారు.
ఎలాంటి రక్షణ లేకుండా..
ఈ సందర్భంగా వారు ముఖానికి మాస్క్ లేదా కర్చీఫ్లను కట్టుకోవడం మినహా ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించలేదు. కూకట్పల్లి, మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ వంటి పోలీస్ స్టేషన్ల ముందు రోజంతా ఇవే దృశ్యాలు కనిపించాయి. తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణంగా లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి పత్రాలు లభిస్తే.. గానీ ఏపీ సరిహద్దుల వరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో- ఆ అనుమతి పత్రాల కోసం ఏపీకి చెందిన విద్యార్థులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు బారులు తీరారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత
అనుమతి పత్రాల కోసం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఒకేసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి పత్రాలను తీసుకొచ్చిన కానిస్టేబుళ్లపై వారంతా ఒకేసారి ఎగబడ్డారు. వారి చేతుల్లో ఉన్న అనుమతి పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ అనుమతి పత్రాలను తమకు అందవనే భయాందోళనలతో వారంతా ఒకేసారి మూకుమ్మడిగా ఎగబడటంతో పరిస్థితులు అదుపు తప్పాయి.
Recommended Video
సమన్వయ లోపం..
ఏపీకి వెళ్లాల్సిన విద్యార్థులు, ఇతర ప్రైవేటు ఉద్యోగులకు అనుమతులను మంజూరు చేసే విషయంలో అటు హైదరాబాద్ పోలీసులు కూడా ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలను కూడా తీసుకోలేదన విషయాన్ని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అనుమతి పత్రాలను మంజూరు చేయడాన్ని క్రమబద్దీకరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమౌతున్నాయి. పోలీస్ స్టేషన్ల వారీగా.. రోజూ పరిమితంగా మాత్రమే వాటిని మంజూరు చేస్తామని ముందుగానే ప్రకటించి ఉంటే.. ఈ దుస్థితి తలెత్తేది కాదని చెబుతున్నారు.