ఆదిలోనే హంసపాదు..!కూటమిలో సీట్ల సర్దుబాటుకు ముందే మొదలైన సరిగమలు..!
హైదరాబాద్: గులాబీ పార్టీని నిలువరించేందుకు తెలంగాణలో ఏర్పడ్డ మహాకూటమిలో మనస్పర్థలు చెలరేగుతున్నాయి. సీట్ల సర్థుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టకుండానే ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకుంటున్నారు. కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతినే విదంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వ్యవహరిస్తున్నారని ఆయన నర్మగర్బ ఆరోపణలు చేస్తున్నారు. ఐతే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాటికి కూటమిలో నెలకొన్న అపోహలు పటాపంచలు అవుతాయనే వాదన కూడా గాంధీభవన్ వర్గాల నుండి వినిపిస్తోంది.
Recommended Video
మహాకూటమికి ముందే మతలబులు..! తెరపైకి వస్తున్న డిమాండ్లు..!
టీఆర్ఎస్ తీసుకున్న ముందస్తు ఎన్నికల అనూహ్య నిర్ణయానికి, అంతే ధీటుగా సమాధానం చెప్పాలనుకుంటున్నాయి తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషించాలని ప్రణాళిక రచించింది. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ నేతలు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ సారి గత ఫలితాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ పార్టీ క్రుత నిశ్చయంతో ఉంది. అందుకోసమే టీ కాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
కూటమిలో అవాక్కయ్యే సంఘటన..! అప్పుడే అసంత్రుప్తి గళాలు..!
తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సహా మరో రెండు పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆయా పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే దీని తాలూకు చర్చలు పూర్తి అయ్యాయని, సీట్ల సర్ధుబాటు అయిపోయిన వెంటనే దీని గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని పార్టీలు అవాక్కయ్యే సంఘటన తెలంగాణ రాజకీయాల్లో తళుక్కుమంది.
కూటమిలో సీపీఐ కీలక పాత్ర..! చాడా ను ఉద్వేగానికి గురిచేస్తున్న కాంగ్రెస్..!
మహాకూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పార్టీల్లో సీపీఐ కూడా ఒకటి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో కలిసి చర్చలు జరపడంలో ముఖ్య భూమిక పోషించారు ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. చాడా లాంటి నాయకుడిని అసంతృప్తికి గురిచేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా చాడ అన్న మాటలు దీనిని ద్రువీకరిస్తున్నాయి కూడా. టీఅర్ఎస్ను ఓడించేందుకు మహాకూటమిని ఏర్పాటు చేస్తుండగా తన సీటుకే ఎసరు పెడ్తామంటే ఎలా? తాను హుస్నాబాద్ నుంచే పోటీ చేస్తా అంటూ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి తేల్చి చెప్పడంతో కూటమిలో ముసలం మొదలైనట్టు తెలుస్తోంది.
హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి కిరికిరి..! శాంతిస్తారా మరి..!!
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కాకముందే హుస్నాబాద్ అభ్యర్థిని తానేనంటూ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ప్రచారం నిర్వహించడం కూటమి ధర్మాన్ని విస్మరించడమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహాకూటమిలో కలకలం మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు మాత్రమే జరిపిన ఆయా పార్టీలు త్వరలో సీట్ల సర్ధుబాటు చేసుకుంటాయని, తర్వాత అధికారికంగా ప్రకటిస్తాయని అనుకుంటున్న సమయంలో చాడ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే మనస్పర్థలు బయటపడడంతో ఆయా పార్టీల నేతలు అవాక్కవుతున్నారు.