ఆ పిలుపే ఆమె ప్రాణం తీసింది!: మృగం కన్నా దారుణంగా ప్రవర్తించిన భర్త..
ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం ఉదయం ఇంట్లోనే మృతిచెందింది.
వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. కేవలం తాను పిలిచినప్పుడు పలకలేదన్న కారణంతో ఓ భర్త మృగంలా ప్రవర్తించాడు. పారతో ఆమె కాళ్లు, చేతులు విరగ్గొట్టాడు.
సరైన చికిత్స అందించకపోవడంతో.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ ఆమె ఇంటి వద్దే మృతి చెందింది. భార్య చనిపోవడంతో భర్త పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ నేపథ్యం:
తాండూరుకు చెందిన అనిత, లారీ డ్రైవర్ శ్రీనివాస్ దంపతులు. ఒకే ఊరైన వీరిద్దరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వినోద్(12), లావణ్య(8), స్వాతి(4) పిల్లలున్నారు. ఇటీవల దీపావళి పండుగ నిమిత్తం అనిత పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చే సమయంలో జరిగిన ఓ ఘటనే ఆమెకు శాపంగా మారింది.
అతని పిలుపు వినిపించలేదు
అక్టోబర్ 22న అనిత పిల్లలతో కలిసి పుట్టింటి నుంచి తమ ఇంటికి ఆటోలో బయలుదేరింది. అనిత ఆటోలో వెళ్తున్న సమయంలో.. ఆ సమయంలో పట్టణంలోని వల్లభాయ్ పటేల్ కూడలి వద్ద ఉన్న శ్రీనివాస్ ఆమెను గమనించాడు. అక్కడినుంచే ఆమెను పిలిచే ప్రయత్నం చేశాడు. అయితే రోడ్డుపై వాహనాల శబ్దాలకు ఆమెకు అతని పిలుపు వినిపించలేదు.
పారతో కాళ్లు, చేతులు విరగ్గొట్టి
ఆ పిలుపు వినిపించకపోవడమే ఆమె పాలిట మృత్యువును తరుముకొచ్చింది. తాను పిలిస్తే పలకలేదన్న కోపంతో.. ఇంటికి రాగానే పార అందుకుని భార్యపై దాడికి దిగాడు శ్రీనివాస్. కాళ్లు చేతులపై పారతో ఇష్టమొచ్చినట్టుగా దాడి చేశాడు. దీంతో కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఆపై స్థానికంగా నాటు వైద్యం చేయించాడు.
పరిస్థితి విషమించి మృతి
పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు శ్రీనివాస్ కు సూచించారు. శ్రీనివాస్ మాత్రం భార్యను ఇంటికి తీసుకెళ్లి పడేశాడు. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం ఉదయం ఇంట్లోనే మృతిచెందింది. భార్య మృతి చెందడంతో శ్రీనివాస్ పరారయ్యాడు. వృద్దురాలైన బాధితురాలి తల్లి భూదేవమ్మ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.