బిర్యానీ వండరాదని భార్యను వదిలేసిన భర్త
వరంగల్: బిర్యానీ వండడం రాదని ఓ భర్త తన భార్యను పుట్టింట్లోనే వదిలేశారు. వివాహమైన రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకొని ఆమెను పుట్టింటికే పరిమితం చేశారు. అయితే తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు గురువారం నాడు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటు చేసుకొంది.
బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు ఓ ప్రబుద్ధుడు. బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు భర్త. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత.
వివరాలు... వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి ఖాజిపేట దర్గాకు చెందిన మానస అనే యువతితో 2016 నవంబరులో వివాహం జరిగింది. సుమారు రూ. 7 లక్షల కట్నం ఇచ్చారు. పెళ్ళైన రెండు నెలలకే బిర్యానీ వండట్లేదని గొడవ చేసి ఇంట్లో నుండి వెళ్లగొట్టాడని బాధితురాలు మానస తెలిపింది.
ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే రాజేంద్రప్రసాద్ రోజు తాగి వచ్చి గొడవ చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు బిర్యానీ వండడం రాలేదనే కారణంగానే తనను పుట్టింట్లోనే వదిలేశారని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.