హుజూర్ నగర్ రిజల్ట్ ... నిర్మానుష్యంగా గాంధీ భవన్ ... కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడుతోంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీనే ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజూర్నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలం గానే వస్తుండటం పార్టీ శ్రేణులను నిరాశ పరుస్తోంది. గాంధీ భవన్ వద్ద పరిస్థితి నిర్మానుష్యంగా తయారైంది. ఆఫీస్ బాయ్ లు మినహాయించి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా గాంధీ భవన్ కు వచ్చిన దాఖలాలు లేవు. అన్ని రూమ్లు తాళాలు వేసి ఒక నిశ్శబ్ద వాతావరణం గాంధీ భవన్ వద్ద కనిపిస్తోంది.
నేతలు లేక వెలవెలబోతున్న గాంధీ భవన్
హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే అర్థమైంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు గాంధీ భవన్ కు వచ్చిన దాఖలాలు లేవు. కనీసం కార్యకర్తలు కూడా గాంధీ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ ఉప ఎన్నికలు కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం చెబుతాం అని భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయాన టీ పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన భార్య పద్మావతి ని గెలిపించడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేశారు.
ఓటర్ల తీర్పుపై మల్లగుల్లాలు
ఇక అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, కీలక నాయకులు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం హుజూర్ నగర్ ప్రచార పర్వం లో పాల్గొని టిఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎవరెంత చెప్పినా, ఎవరేం చేసినా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన మాటలు ఓటర్లు పరిగణలోకి తీసుకోలేదని హుజూర్నగర్ ఎన్నికల ఫలితం తేల్చి చెప్పేస్తుంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నైరాశ్యం అలుముకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై మాట్లాడేందుకు సైతం ఆసక్తి చూపించడం లేదు.
ఓడిపోతే ఎలా ? ఏం చెప్పాలి .. ఏం చెయ్యాలి
ప్రస్తుత పరిస్థితులను, ఓడిపోతే అందుకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక అంతే కాదు ముందు ముందు టిఆర్ఎస్ పార్టీ ని ఎలా ఎదుర్కోవాలి అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. గాంధీభవన్ వద్ద ప్రతిరోజు కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు సందడి అయినా కనిపిస్తుంది. కానీ నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హుజూర్ నగర్ ఫలితం వస్తున్న నేపథ్యంలో గాంధీభవన్ వెలవెలబోతోంది. అన్ని గదులకు తాళాలు దర్శనం ఇస్తున్నాయి.ఇక ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఓటమిని చెప్పకనే చెబుతోంది.
హుజూర్ నగర్ ఫలితం జీర్ణించుకోలేక సైలెంట్ అయిన నేతలు
కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ఓడి పోతున్నామని సంకేతాలను ఇస్తున్నాయి. ఇక ఈ ఓటమి భారాన్ని ఎలా తట్టుకోవాలి. ఏకంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు భుజాన వేసుకొని పని చేసినా ఫలితం రాకపోవడం ఎలా జీర్ణించుకోవాలి. హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెళ్లి ప్రచారం చేసిన ప్రజలు ఆదరించు పోవడాన్ని ఎలా తీసుకోవాలి అన్న బాధలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు.
గాంధీ భవన్ కు రాకుండా ముఖం చాటేసిన నేతలు
గెలుపు ధీమా తో మాట్లాడిన నేతలు గాంధీభవన్లో మీడియాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ముఖం చాటేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీభవన్ వాతావరణమే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని అర్థమయ్యేలా చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఓటమిపాలు కాబోతుంది అన్న ఆవేదనలో ఉన్న నేపథ్యంలోనే గాంధీ భవన్ నిర్మానుష్యంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు.