చకచకా హామీల అమలుకు చర్యలు.. హడావుడిగా సాగర్లో సభ.. కేసీఆర్లో మార్పు..? హుజురాబాద్ ఎఫెక్టేనా...?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) పరిధిలోని హెయిర్ సెలూన్లు,లాండ్రీ షాపులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన షాపుల యజమానులు ఉచిత విద్యుత్ సౌకర్యం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకూ అతి కొద్ది మంది మాత్రమే ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటన చేశారు. ఇది మాత్రమే కాదు... నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్లో పర్యటించి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులు ప్రకటించారు. ఇదంతా హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్టేనా అన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి...
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు.మీ సేవా కేంద్రాల్లో ఉచితంగా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని... దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయి బ్రాహ్మణులు,రజకులకు పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హెయిర్ సెలూన్లు,లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలుచేస్తామన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో దీన్ని అమలుచేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.
హుజురాబాద్ ఎఫెక్టేనా...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో గత హామీలన్నింటినీ చకచకా నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతుండటం గమనార్హం. నిన్నటికి నిన్న నాగార్జునసాగర్లో పర్యటించిన కేసీఆర్... గతంలో ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్దికి రూ.150 కోట్లు ప్రకటించారు. స్థానికంగా మెరుగైన రోడ్లు,ఆస్పత్రులు,ఇరిగేషన్ లిఫ్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతామన్నారు. హామీల అమలు విషయంలో కేసీఆర్ దూకుడు పెంచడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్టే ఇందుకు కారణమా అన్న చర్చ జరుగుతోంది.
ఆ అపప్రదను తొలగించుకునేందుకేనా...
సాధారణంగా ఎక్కడ ఎన్నికల సభలో పాల్గొన్నా... 'ఎన్నికలు అయిపోయిన వెంటనే వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా.. మీతోనే కూర్చుంటా... మొండిపట్టు పట్టి పనులు పూర్తి చేసుకుందాం' లాంటి మాటలు కేసీఆర్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఎన్నికలు ముగిశాక అటువైపు వెళ్లిన దాఖలాలు అరుదనే చెప్పాలి. ప్రస్తుతం హుజురాబాద్లో సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. దళిత బంధు స్కీమ్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిశాక కేసీఆర్ హుజురాబాద్ను కూడా పట్టించుకోరని.. గతంలో ఎన్నో ఎన్నిక సభల్లో ఆయన హామీలు ఇచ్చి విస్మరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అపప్రదను తొలగించుకునేందుకే ఆయన హడావుడిగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వెళ్లి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.
Recommended Video
హాట్ టాపిక్గా కేసీఆర్ వైఖరి...
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు స్కీమ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.నియోజకవర్గంలో కొత్త ఫించన్లు,కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. మున్సిపాలిటీల అభివృద్దికి ఇప్పటికే నిధులు విడుదల చేశారు. ఇదంతా ఉపఎన్నిక కోసమే అన్న విమర్శలు వస్తుండగా... తమదేమీ సన్నాసుల మఠం కాదని,కచ్చితంగా రాజకీయ లబ్ది కోరుకుంటామని కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు. అయితే దళిత బంధు పథకం అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీలను ఆయన నెరవేర్చలేకపోయారని గుర్తుచేస్తున్నాయి. కాబట్టి ఉపఎన్నికకు ముందే దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేయాలని ప్రతిపక్షాలు,దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆరు నూరైనా,అవసరమైతే రూ.1లక్ష కోట్లు ఖర్చు చేసైనా దళిత బంధు అమలుచేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మొత్తం మీద హుజురాబాద్ ఉపఎన్నిక వేళ కేసీఆర్ వైఖరి హాట్ టాపిక్గా మారింది.