ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్...
హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులను ఆహ్వానిస్తున్నారు. గ్రామానికి నలుగురు చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామానికి చెందిన ఎంపీటీసీ భర్త వాసాల రామస్వామికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్పై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఫోన్ కాల్ సంభాషణ...
'రామస్వామి గారు... బాగున్నారు కదా... ఒక రిక్వెస్టు... ప్రభుత్వం తీసుకున్న దళిత బంధు విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. చాలా బాధ్యతతో,ఓపికతో,ఒక దృక్పథంతో చేసే పని ఇది. జిల్లా కలెక్టర్ మీకు ఫోన్ చేస్తారు. రేపు కలెక్టర్ ఆధ్వర్యంలో 26వ తేదీ కార్యక్రమం గురించి మీకు అవగాహన కల్పిస్తారు. ఆరోజు అన్ని మండలాల నుంచి గ్రామానికి ఇద్దరు మహిళలు,ఇద్దరు పురుషుల చొప్పున బస్సుల్లో హైదరాబాద్కు వస్తారు. ఆరోజంతా దళిత బంధు పథకానికి సంబంధించి సంపూర్ణంగా చర్చిస్తాం.దీన్ని గొప్పగా ముందుకు తీసుకుపోవాలి. హుజురాబాద్ తర్వాత మీరు రాష్ట్రమంతా పోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల్లో దీన్ని సక్సెస్ చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దాం. ' అని కేసీఆర్ పేర్కొన్నారు.
'ఈటల రాజేందర్ చిన్నోడు...'
కేసీఆర్ మాట్లాడుతుండగా మధ్యలో కల్పించుకున్న ఎంపీటీసీ... 'సార్ మీ నాయకత్వంలో 2001 నుంచి నేను పనిచేస్తున్నాను. కానీ ఈటల రాజేందర్ నన్నెప్పుడూ పక్కన పెడుతూ వచ్చాడు. 2018లో కూడా నాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను. అప్పటినుంచి మళ్లీ ఆయన దగ్గరికి పోలేదు.' అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్... 'ఈటల రాజేందర్ చాలా చిన్నోడు... ఆయనతోని అయ్యేది లేదు సచ్చేది లేదు... ఆ విషయం విడిచిపెట్టండి. దళిత బంధు చాలా పెద్ద మిషన్. నిబద్దతతో,మొంటిపట్టుతో దీన్ని చేసి చూపిద్దాం. ప్రాణం పోయినా వెనక్కి తగ్గే ముచ్చట లేదు.' అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Recommended Video
హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్ట్...
మొదట దళిత సాధికారత పేరుతో పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్... ఆ తర్వాత దాన్ని దళిత బంధుగా మార్చిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా మొదట హుజురాబాద్లో దీన్ని అమలుచేయనున్నారు. హుజురాబాద్లో దాదాపు 50వేల పైచిలుకు దళిత జనాభా ఉండగా... ఇందులో 20వేల పైచిలుకు మందికి లబ్ది చేకూర్చేలా పథకాన్ని అమలుచేయనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం రూ.2వేల కోట్లు,అంతకన్నా ఎక్కువే ఖర్చు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ఎన్నికల డ్రామా అని ఆరోపిస్తున్నాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచేందుకే కేసీఆర్ దీన్ని తెర పైకి తీసుకొచ్చారని... రాష్ట్రమంతా దీన్ని అమలుచేయడం ఆచరణ సాధ్యం కాదని అంటున్నాయి.