న్యాయవ్యవస్థను కించపరిచారు: చిక్కుల్లో 'జబర్దస్త్' కామెడీ షో
హైదరాబాద్: ఓ తెలుగు టీవీ ఛానల్లో బాగా పాపులారిటీని సంపాదించిన 'జబర్దస్త్' షో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 'జబర్దస్త్' టీంపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో 'జబర్దస్త్'లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు 'జబర్దస్త్' టీంకు నోటీసులు జారీ చేసింది. కాగా, 'జబర్దస్త్' షోపై గతంలో గౌడ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2014లో ప్రసారమైన ఓ ఎపిసోడ్ కల్లుగీత కార్మికులను, గౌడ మహిళలను కించపరిచేలా ఉందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.
'జబర్దస్త్' టీం, న్యాయనిర్ణేతలతో పాటు ఈ-టీవీ యాజమాన్యంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కల్లుగీత కార్మికులపై స్కిట్ వేసిన వేణు వండర్స్ టీం లీడర్ వేణుపై కూడా కొందరు యువకులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కమెడియన్ వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు హైదరాబాదులో నిరసన కూడా తెలిపారు. తెలుగు ప్రజలకు బాగా చేరువైన ఈ కామెడీ షోకు ప్రముఖ సినీ నటుడు నాగబాబుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ వినోద కార్యక్రమం విశేషమైన ప్రజాదరణ పొందింది. హాస్యం, వ్యంగ్యం ప్రధానాంశాలుగా ఈ వినోద కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను ఈ కార్యక్రమం విశేషంగానే ఆకర్షిస్తోంది. ఖతర్నాక్ కామెడీ షో అంటూ జబర్దస్త్కు ట్యాగ్ లైన్ కూడా ఇస్తున్నారు.