గడియారాలు, బొట్టు బిళ్ళలు కాదు, దమ్ముంటే ఆ పని చేసి ఓట్లడుగు .. ఈటల రాజేందర్ కు మంత్రి హరీష్ రావు సవాల్
బిజెపి నాయకుడు, మాజీ మంత్రి, హుజురాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ తన బాధను ప్రజల బాధగా రుద్ది లాభపడాలని చూస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధను తన బాధగా భావించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనకు కితాబిచ్చిన హరీష్ రావు
హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న హరీష్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక తాజాగా హుజురాబాద్ పట్టణంలోని ప్రతాప్ సాయి గార్డెన్ లో నీటి కుళాయిలు, విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతి పత్రాలు, భూమి అధీన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణ లో సీఎం కేసీఆర్ పాలనకు కితాబిచ్చారు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా నల్లాలు, విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ మీటర్ల మార్పు వంటివి చేస్తున్నామని పేర్కొన్నారు.
బిజెపికి ఓటు వేస్తే, ప్రస్తుతం పెంచిన ధరలకు మద్దతు ఇచ్చినట్టే
కొంతమంది నేతలు తమ బాధను ప్రజల బాధగా రుద్ది లాభపడాలని చూస్తున్నారని, కానీ సీఎం కేసీఆర్ ప్రజల బాధను తన బాధగా భావిస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలలో ఈటల రాజేందర్ ను చిత్తుగా ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. గడియారాలు, బొట్టు బిళ్ళలు ఇవ్వడం కాదని, దమ్ముంటే సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పి హుజురాబాద్ ప్రజలను ఓట్లు అడగాలి అని ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. బిజెపికి ఓటు వేస్తే, ప్రస్తుతం పెంచిన ధరలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.
బీజేపీ ఇచ్చిన ఆ హామీల మాటేంటి? హరీష్ ప్రశ్న
బీజేపీని గెలిపిస్తే సిలిండర్ ధర మూడు వేల రూపాయలు, నూనె ధర మూడు వందలకు పెంచుతారని హరీష్ రావు స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని హరీష్ రావు కోరారు రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి పక్క జిల్లాల నుండి, పక్క నియోజకవర్గాల నుండి మనుషులు వచ్చారని, ఈటల చెప్తున్నారని పేర్కొన్న హరీష్ రావు ఈటల భయపడి మాట్లాడుతున్నట్టు అర్థమవుతోంది అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఏమయ్యాయని హరీష్ రావు ప్రశ్నించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్ లో కొనసాగుతున్న ఎన్నికల వేడి .. వ్యూహాలతో టీఆర్ఎస్, బీజేపీ
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు ఆలస్యం అవుతున్నా సరే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నాయి. ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలన, దొరల పాలనను ఈటల రాజేందర్ ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్తున్నారు.