అక్కడ టీఆర్ఎస్కు కష్టమేనా.. ఈ లెక్కలు ఆ పార్టీకి అనుకూలమా?
నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఆ పార్టీల అభ్యర్థులకు తోడుగా క్యాడర్, లీడర్లంతా అక్కడే మకాం వేశారు. గెలుపు మాదంటే మాదంటూ ప్రతి సవాళ్లు విసురుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుజుర్నగర్ బరి ఏం చెబుతోంది. పాత చరిత్ర ఏమంటోంది. ఆ లెక్కలు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతాయి. ఇంతకు గెలుపెవరిది మరి. ఇలాంటి కాలిక్యులేషన్లు రాష్ట్రమంతటా చర్చానీయాంశంగా మారాయి.
ఉత్తమ్ రాజీనామాతో ఉప ఎన్నిక
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ పోరులో నల్గొండ ఎంపీగా బరిలోకి దిగి మళ్లీ విజయం సాధించారు. అయితే ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో నిలిచారు.
రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!
స్వతంత్ర అభ్యర్థులతో ముప్పేనా..?
హుజుర్నగర్ అసెంబ్లీ స్థానంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పురుషులు, మహిళల ఓట్లు చెరో లక్షకు పైగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ కనిపిస్తున్నా.. ఇండిపెండెంట్లతో ఆ రెండు పార్టీలకు ముప్పు పొంచి ఉందనే వాదనలు లేకపోలేదు. గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు పోటీ చేసి దాదాపు 10 వేల ఓట్లు సాధించారు. అందులో ఒక్క అభ్యర్థికే 5 వేల ఓట్లు పడటం విశేషం.
ఎవరు గెలిచినా మెజార్టీ కష్టమేనా?
ఈసారి కూడా హుజుర్నగర్లో ఇండిపెండెంట్ల హవా కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఎన్నికల బరిలోకి దిగారు. ప్రచారంలో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకెళుతున్నారు. మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సై అనడంతో హుజుర్నగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. దాంతో ఈసారి కూడా ఇండిపెండెంట్ల బాధ తప్పేలా లేదు. గెలుపోటములు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ఎవరు గెలిచినా దాదాపు తక్కువ మెజార్టీతో బయటపడతారనే టాక్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో మెజార్టీ 7 వేలు.. ఈసారి తక్కువేనా?
ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించినా.. కేవలం వేయి, రెండు వేల ఓట్ల తేడాతో బయటపడే ఛాన్స్ కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగానీ వేలకు వేల ఓట్లు సాధించి బంపర్ మెజార్టీ అంటూ ఏమి ఉండకపోవచ్చనేది కొందరి మాట. ఈ లెక్కన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 92 వేల 996 ఓట్లు పోలయ్యాయి. అదే టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 85 వేల 530 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 7 వేల 466 ఓట్ల మెజార్టీతో ఉత్తమ్ గెలుపొందారు. ఇక్కడ గణాంకాలు సరి చూస్తే ఇండిపెండెంట్లు అందరూ కలిసి దాదాపు 10 వేల ఓట్లు సాధించారు. అంటే ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు బరిలో లేకుంటే ఆ ఓట్లు కారు గుర్తుకు కలిసొచ్చి టీఆర్ఎస్ గెలిచి ఉండేదనే టాక్ వినిపించింది.
50 శాతం ఓట్లు మాకేనంటూ.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ.. కేటీఆర్ ఫుల్ ఖుషీయా?
కాంగ్రెస్ పార్టీ కంచుకోట.. కారు దూసుకెళ్లేనా..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటికీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో కోదాడ నుంచి విజయం సాధించారు. అనంతరం 2009, 2014లో హుజుర్నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచినప్పటికీ అటు నల్గొండ ఎంపీగా విజయం సాధించడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఈ లెక్కన ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినట్లైంది. అయితే హుజుర్నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే లెక్క కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంచనాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.