Huzurnagar by election results 2019 : హుజూర్ నగర్ ఫలితాల్లో ఇండిపెండెంట్ కంటే వెనుకబడిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న బిజెపికి హుజూర్నగర్ ఉప ఎన్నికలలో గట్టి దెబ్బే తగిలింది. తెలంగాణలో ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి చుక్కలు చూపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హుజూర్ నగర్ లో బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే వెనుకపడటం, దారుణ ఓటమిదిశగా పయనిస్తుండడం ఆ పార్టీకి ఘోర అవమానంగా మారిందని చెప్పొచ్చు.
నాల్గవ స్థానంలో బీజేపీ
బీజేపీకి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ మొదటి స్థానంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సపావత్ సుమన్ హెల్మెట్ గుర్తుతో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు రాగానే ఎగిరెగిరి పడిన బీజేపీకి ఇంతకంటే ఘోర అవమానం లేదని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు మొదలుపెట్టాయి.
కనీసం పరువు దక్కించుకోలేకపోయిన బీజేపీ
ఇక అంతే కాదు ఈ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కు కంచుకోటలైనమట్టపల్లి, నేరేడుచర్ల మండలాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక తాజా హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ మాత్రమేనని ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. కేంద్రం వరకే బీజేపీ పరిమితం అని తేల్చిచెప్పారు. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కేంద్ర అధిష్టానం దృష్టి సారించాలని భావించిన నేపథ్యంలో హుజూర్ నగర్ ఫలితం బీజేపీ అధిష్టానానికి సైతం షాక్ ఇచ్చింది.
మూడో స్థానంలో ఇండిపెండెంట్ .. ఆ తర్వాత జాతీయ పార్టీ బీజేపీ
హుజూర్ నగర్ విజయంతో సీఎం కేసీఆర్ ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. కాంగ్రెస్ బిజెపి లపై ఆయన తనదైన శైలిలో విరుచుకు పడతారు అని అంతా భావిస్తున్నారు.
ఇక హుజూర్ నగర్ లో హెల్మెట్ గుర్తు కలిగినస్వతంత్య్ర అభ్యర్థి కి ఇప్పటివరకు 2011 ఓట్లు వచ్చాయి. పోలింగ్ శాతం 1.27 శాతంగా ఉంది. ఇక బిజెపికి ఇప్పటివరకు 1779 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 1.12 శాతంగా ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో టిడిపి 1440 ఓట్లతో ఉంది. పోలింగ్ శాతం ౦.91 శాతంగా ఉంది.
ఫలితాలపై బీజేపీ నాయకులు ఏం చెప్తారో
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత బీజేపీ నాలుగో స్థానంలోకి దిగజారింది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. ఇక ఇప్పుడు ఈ ఫలితం నేపధ్యంలో బీజేపీ తన పంధా మార్చుకుంటుందా అన్నది ఆసక్తికర అంశమే. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న బిజెపి ఈ ఫలితాలపై ఏమని చెప్తుందో వేచి చూడాలి.