Huzurnagar by election results 2019: కాంగ్రెస్ ఓటమి ...టీడీపీ,బీజేపీల డిపాజిట్లు గల్లంతు
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా చేజార్చుకుంది. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. హుజూర్ నగర్ లో తొలిసారిగా గులాబీ జెండా రెపరెపలాడింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. సైదిరెడ్డి 43,284ఓట్ల మెజార్టీ సాధించారు.
మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని తన ఖాతాలో వేస్తున్నట్లుగానే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అంతేకాదు హుజూర్ నగర్ లో ఇప్పటి వరకు ఏడు సార్లు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 29,194. ఏ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించిన హుజూర్నగర్ లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం ఆదరించలేదు.
కాంగ్రెస్ పార్టీ ఒకపక్క ఆర్టీసీ కార్మికుల సమ్మెను హుజూర్నగర్ ఓటు బ్యాంకు కోసం అస్త్రంగా వాడినప్పటికీ అక్కడి ప్రజలు ఆదరించలేదు. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే అభివృద్ధి సాధ్యపడుతుందని భావించిన నేపథ్యంలోనే ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరులో మేము సైతం సత్తా చాటుతాం అంటూ బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు డిపాజిట్లు కోల్పోయి పరువు పోగొట్టుకున్నాయి.
బిజెపికి 2247 ఓట్లు పోల్ కాగా, తెలుగుదేశం పార్టీకి 1595 ఓట్లు పోలయ్యాయి. బిజెపి ఓటింగ్ శాతం 1.27 శాతం కాగా, టిడిపి ఓటింగ్ శాతం 0.9 గా ఉంది. ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలతో గుణపాఠం చెబుతామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలై చావు దెబ్బ తింది. ఇక బీజేపీ, టీడీపీలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారాయి.