Huzurnagar by election results 2019: ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి .. ఇంతకీ ఎవరీ సైదిరెడ్డి
Recommended Video
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఫలితంలో దూకుడు చూపిస్తున్న శానంపూడి సైదిరెడ్డి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సైదిరెడ్డి స్థానికత పై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో సైదిరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడా? టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి నేపథ్యంలో సైదిరెడ్డి కి టికెట్ ఎందుకు కేటాయించారు. అసలు ఇంతకీ సైదిరెడ్డి నేపథ్యం ఏంటి? అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం.
నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ :హుజూర్ నగర్ లో సైదిరెడ్డి ఆధిక్యం ఇలా.. : కలిసొచ్చిన అంశాలేంటి..!
మొదటి నుండి సైదిరెడ్డి కుటుంబానికి రాజకీయ నేపధ్యం
శానంపూడి సైదిరెడ్డి.. సూర్యాపేట జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందినవారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున ఆంధ్రా సరిహద్దు గ్రామం గుండ్లపల్లి. ఈ గ్రామానికి చెందిన సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి. అంకిరెడ్డి ఆ గ్రామ సర్పంచ్ గా పని చేశారు. స్థానికంగా మంచి రాజకీయ పలుకుబడి ఉంది.అంతేకాదు రాజకీయాల్లో రాణిస్తున్న ఓ పెద్ద బంధుగణమే సైదిరెడ్డికి ఉంది. ఇక సైదిరెడ్డి విషయానికి వస్తే ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న సైదిరెడ్డి 1995లో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చదివారు. గుండ్లపల్లి గ్రామంలో జన్మించినప్పటికీ కెనడాలో ఫుడ్ బిజినెస్ లో రాణించి, మంచి పేరు ప్రతిష్టలు సాధించారు సైదిరెడ్డి.
కెనడాలో ఫుడ్ బిజిన్స్ లో రాణించిన సైదిరెడ్డి
మొదటి ఐటీ ప్రొఫెషనల్ గా యునైటెడ్ నేషన్స్ లోని కరేబియన్ లో ఉద్యోగం చేసిన సైదిరెడ్డి, ఆ తర్వాత కెనడా వెళ్లారు. 2005లో కెనడా లో అడుగుపెట్టిన ఆయన తన భార్య రజిత తో కలిసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. మయూరి ఇండియన్ రెస్టారెంట్ పేరుతో ఆయన ఫుడ్ బిజినెస్ లో బాగా రాణించారు. డబ్బు తో పాటుగా పేరు ప్రతిష్ఠలను సంపాదించారు. ఇక సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితుడై టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలోనూ కార్పొరేట్ వ్యాపారం లో తనదైన శైలిలో దూకుడు చూపించారు. 2015 లో యాదాద్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా కార్పొరేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు శానంపూడి సైదిరెడ్డి.
యువతలో నైపుణ్యం పెంచేందుకు, సేవా కార్యక్రమాల కోసం కృషి చేసిన సైదిరెడ్డి
ఇక అంతే కాదు 2015 లో రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ ఎంపవర్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఆయన గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్యాన్ని పెంచే సంస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. 2016లో శానంపూడి సైదిరెడ్డి తన తండ్రి పేరు మీద అంకిరెడ్డి ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు.అప్పటికే ఒక ఎన్నారైగా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతూ, స్థానికంగా స్థానిక సంస్థల్లో విజయం సాధించిన నాయకుల అతి పెద్ద బంధుగణం ఉండి, మొదటినుంచి రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చిన కుటుంబం కావడంతో సైదిరెడ్డి కి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు.
గత ఎన్నికల్లో హుజూర్ నగర్ లో పోటీ చేసి ఓటమి పాలైన సైదిరెడ్డి
2014 ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికల బరిలోకి దింపి తెలంగాణ అమరవీరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగా ఆయన ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి కి స్థానికంగా ఉన్న పట్టు ఉండడం, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో గులాబి బాస్ కెసిఆర్ టీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పోటీ చేయడానికి గత ఎన్నికల్లో అవకాశం కల్పించారు. అయితే గత ఎన్నికల్లో కేవలం ఏడు వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
స్థానికంగా ఉన్న బలం , బలగం ఉన్న నేత ... ఇప్పుడు ముందంజలో సైదిరెడ్డి
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం, గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన లోటుపాట్లను సరిదిద్దుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సైదిరెడ్డి బంధుగణం మద్దతు ఇవ్వడం , అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా యూత్ ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియాలో సైదిరెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం వంటి కారణాలు లభిస్తాయని భావించిన గులాబి బాస్ కేసీఆర్ మరోమారు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇంకెప్పుడు శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ లో గులాబీ జెండా ను రెపరెపలాడించే పనిలో ఉన్నారు.